ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
విశాలాంధ్ర-హైదరాబాద్: పారిశ్రామికాభివృద్ధిలో తెలంగాణ ప్రపంచ దేశాలతో పోటీపడేలా విధానాలు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కు సంబంధించి మంగళవారం అధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి తీసుకోవాల్సిన నూతన విధానాలపై సూచనలు చేశారు. గత సమీక్షా సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు, పనుల్లో పురోగతికి సంబంధించిన వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. టెక్స్టైల్స్ కు సంబంధించి రాష్ట్రంలోని పవర్ లూమ్, హ్యాండ్ లూమ్ కార్మికులకు ఉపయోగపడేలా కొత్త విధానం రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించి కొత్తగా ఆరు విధానాలను రూపొందించనున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఎంఎస్ఎంఈ పాలసీ, ఎక్స్ పోర్ట్ పాలసీ, న్యూ లైఫ్ సైన్సెస్ పాలసీ, రివైజ్డ్ ఈవీ పాలసీ, మెడికల్ టూరిజం పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీలను రూపొందిస్తుమన్నామని సీఎంకు వివరించారు. ఎన్నికల కోడ్ ముగిసేలోగా పారిశ్రామిక విధానాలను పూర్తిస్థాయిలో రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి ప్రపంచ దేశాల్లో అత్యుత్తమ విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు.