ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి సర్వం సిద్ధమైందని, ఇప్పటికే పలుధపాలుగా బీసీ సంఘాలతో సమావేశమై 32 బీసీ కులాలను ఏకతాటిపైకి తెచ్చిన ప్రభుత్వం, కోకాపేట్, ఉప్పల్ భగాయత్లో కేటాయించిన వేల కోట్ల విలువైన 87.3 ఎకరాల్లో అన్ని పనులు పూర్తి చేసుకొని నిర్మాణాలు ప్రారంభించడానికి ముహుర్తం ఖరారు చేసిందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. పిభ్రవరి 5న కోకాపేట్లో, 6న ఉప్పల్ భగాయత్, పిర్జాదిగూడల్లో అయా సంఘాలతో సామూహికంగా భూమిపూజలు నిర్వహిస్తామన్నారు. బుధవారం హైదరాబాద్ దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్లో 32బీసీ కుల సంఘాల ప్రతినిధులతో పాటు బీసీ సంక్షేమ శాఖ ప్రిన్షిపల్ సెక్రటరీ బుర్రావెంకటేశం, సంబందిత శాఖల ఉన్నతాధికారులతో కలిసి మంత్రి గంగుల సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి గంగుల మాట్లాడుతూ.. 75 ఏళ్ల స్వతంత్య్ర భారత చరిత్రలో ఏ ప్రధాని, ఏ ముఖ్యమంత్రి చేయని విదంగా 41 బీసీ కులాల ఆత్మగౌరవం కోసం కేసీఆర్ అత్యంత విలువైన జాగలను హైదరాబాద్లో కేటాయించి వాటికి నిధులతో పాటు ఆయా కులాల ఆత్మగౌరవం ప్రతిభింబించేలా నిర్మించుకునే సువర్ణ అవకాశం సైతం ఆయా బీసీ కులసంఘాలకే కల్పించారన్నారు. దీన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆర్డర్లు పొందిన ప్రతీ ఏక సంఘం మార్చి 31లోగా స్లాబులు పూర్తయ్యేలా నిర్మాణాలు ప్రారంభించాలన్నారు. ఇప్పటికే అనుమతి పత్రాలు పొందిన ఏ బీసీ కులమైన ఈ గడువులోగా ముందుకు రాకపోతే ప్రభుత్వమే నిర్మాణాలను చేపడుతుందన్నారు. మిగతా సంఘాలు సైతం అతిత్వరలో నిర్ణయం తీసుకోవాలని సూచించారు.