మునుగోడులో బీజేపీకి ఓటమి తప్పదని, అందుకే ఆ పార్టీ అడ్డదారులు తొక్కుతుందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడు రిటర్నింగ్ ఆఫీసర్ బదిలీ వ్యవహారంలో కేంద్ర ఎన్నికల కమిషన్ వ్యవహరించిన తీరు ఆక్షేపనీయమని కేటీఆర్ పేర్కొన్నారు. బీజేపీ రాజ్యాంగ వ్యవస్థలను ఏ విధంగా దుర్వినియోగం చేస్తుందో తెలిపేందుకు ఇది ఒక మరో తార్కణమని ఆయన తెలిపారు. పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్య స్ఫూర్తికి అద్దం పట్టే విధంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషన్ పైన భారతీయ జనతా పార్టీ ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తుందని ధ్వజమెత్తారు.