హైదరాబాద్ : ఈ మధ్య కాలంలో కుటుంబ కథాచిత్రంగా వచ్చిన సినిమాలలో ‘సామజవరగమన’ ఒకటి. శ్రీవిష్ణు – రెబా మోనికా జాన్ జంటగా నటించిన ఈ సినిమాను రాజేశ్ దండా నిర్మించగా.. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించాడు. నరేశ్ .. వెన్నెల కిశోర్ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, జూన్ 29వ తేదీన థియేటర్లకు వచ్చింది. ‘ఆహా’లో గురువారం విడుదలైంది. ముందనుకున్న ప్రకారం ఈ సినిమా శుక్రవారం విడుదల కావాల్సి ఉన్నప్పటికీ ఒకరోజు ముందే ట్రాక్ పైకి తెచ్చేశారు. హైదరాబాద్ – రాజమండ్రి మధ్య ఈ కథ నడుస్తుంది. ప్రేమ – పెళ్లి అనే అంశాల చుట్టూ తిరుగుతుంది. సినిమా మొదలైన దగ్గర నుంచి చివరి వరకూ బోర్ కొట్టకుండా నడుస్తుంది. గతంలో హీరోయిన్స్ వైపు నుంచి చూపించిన కోణాలను, ఈ సినిమాలో హీరో వైపు నుంచి చూపిస్తూ దర్శకుడు నాన్ స్టాప్ గా నవ్వించాడు. తాను ఇంకా యంగ్ అనుకునే పాత్రలో నరేశ్ ఫస్టాఫ్ లో నవ్విస్తే, కులపిచ్చి ఉన్న కులశేఖర్ పాత్రలో వెన్నెల కిశోర్ నవ్వులు పూయిస్తాడు. ప్రీ క్లైమాక్స్ నుంచి నవ్వుల శాతం మరింత పెరుగుతూ, మంచి ట్విస్ట్ తో ముగుస్తుంది. ఓటీటీ వేదికపై ఈ సినిమాకి మరింత ప్రేక్షకాదరణ లభించే అవకాశం ఉంది.