. నిర్దేశిత కక్ష్యలోకి ఏడు ఉపగ్రహాలు
. త్వరలోనే జీఎస్ఎల్వీ, ఎస్ఎస్ఎల్వీ ప్రయోగాలు : సోమనాథ్
విశాలాంధ్ర-సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టింది. పీఎస్ఎల్వీ సీ-56 రాకెట్ను నింగిలోకి పంపింది. ఆదివారం ఉదయం 6.30 గంటలకు ఆంధ్రప్రదేశ్, శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్ర (షార్) నుంచి పీఎస్ఎల్వీ- సీ56 రాకెట్ నిప్పులు కక్కుతూ దూసుకెళ్లింది. నాలుగు దశల్లో ప్రయోగం పూర్తి అయింది. ఈ ప్రయోగం ద్వారా సింగపూర్కు చెందిన 420 కిలోల బరువున్న ఏడు ఉపగ్రహాలను నిర్దేశిత భూ కక్షలోకి చేర్చారు. రాకెట్ను ప్రయోగించిన 19 నిమిషాలకు మొదటి ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టగా, మరో నాలుగు నిమిషాలలో మిగిలిన ఆరు నానో ఉపగ్రహాలను నిర్దేశిత కక్షకు చేర్చడంతో ప్రయోగం పూర్తి అయినట్లు ఇస్రో చైర్మన్ సోమనాధ్ ప్రకటించారు. ప్రయోజం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలను అభినందించారు. పీఎస్ఎల్వీ-సీ 56 రాకెట్ ప్రయోగం విజయంపై హర్షం వ్యక్తం చేసిన ఆయన ఆగస్టు లేదా సెప్టెంబర్లో మరో పీఎస్ఎల్వీని ప్రయోగిస్తామని చెప్పారు. అలాగే గగన్యాన్, ఎస్ఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ మార్క్-3 ప్రయోగాలకు సిద్ధమవుతున్నామని తెలిపారు. ఈ ఏడాది ఇస్రోకు ఇది మూడో వాణిజ్యం ఉపగ్రహ ప్రయోగం కాగా తాజాగా పంపిన నానో ఉపగ్రహాల్లో వేలోక్స, ఆర్కేడ్ , స్కూబీ, న్యూ లైన్, గాలాసియా -2,12 స్త్రీడర్ ఉన్నాయి. పీఎస్ఎల్వీ సిరీస్లో ఇది 58వ ప్రయోగం. ఇప్పటి వరకు 92 రాకెట్లను షార్ నుంచి ఇస్రో ప్రయోగించింది. 34 దేశాల 424 వాణిజ్య ఉపగ్రహాలను నింగిలోకి పంపింది.