విశాలాంధ్ర,పార్వతీపురం: నిర్మాణాలు పూర్తయిన భవనాలను సంబంధిత శాఖల అధికారులకు అప్పగించాలని జిల్లా కలెక్టరు నిశాంత్ కుమార్ ఇంజనీరింగు అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరు కార్యాలయంనుండి జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి డా.ఎం.వి.ఆర్.కృష్ణాజితో కలిసి
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రాధాన్యతాభవనాల నిర్మాణాల పురోగతిపై మండలాలవారీగా పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగు అధికారులతో సమీక్ష నిర్వహించారు.
సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టరు మాట్లాడుతూ పూర్తిచేసిన సచివాలయాలు,రైతుభరోసా కేంద్రాలు, వెల్ నెస్ సెంటర్ల భవనాలను సంబంధితశాఖల అధికారులకు వెంటనే అప్పగించాలన్నారు. నిర్మాణ పనులు పూర్తికాకుండా పూర్తయినట్లుగా నివేదికలు అందజేస్తే కఠినచర్యలు తీసుకుంటామని, నిర్మాణాలు పూర్తయిన భవనాలలో టాయిలెట్స్, నీటిసరఫరా వంటి మౌళికసదుపాయాలు పూర్తిచేసి ఉండాలన్నారు. ఫైనల్ స్టేజ్ లోగల భవనాలను జూలై 12నాటికి పూర్తిచేసి అప్పగించాలని తెలిపారు.పూర్తిచేసిన భవనాలకు బిల్లులు చెల్లించడం జరిగిందని, భవన నిర్మాణాలు త్వరగా పూర్తిచేసి బిల్లులు చెల్లింపులు పూర్తి చేయాలని సూచించారు. బేస్ మెంటు దాటిన భవన నిర్మాణాలు పూర్తిచేయాలన్నారు. వెల్ నెస్ సెంటర్ల నిర్మాణానికి నిధులు సమస్యలేదని, మంజూలైన మొత్తం వెల్ నెస్ సెంటర్ల నిర్మాణాలు పూర్తిచేయాలని తెలిపారు. నిర్మాణ పనులు వేగిర పరిచేందుకు ప్రభుత్వం సిమెంటు కొనుగోలుకు అనుమతి యిచ్చిందని, సకాలంలో బిల్లులు చెల్లింపులు జరుగుతున్నాయని కావున అధికారులు లక్ష్యం మేరకు నిర్మాణ పనులు పూర్తిచేయించాలన్నారు. చేసిన పనులకు బిల్లులను వెంటనే చెల్లింపుల కొరకు పంపించాలన్నారు. భవనాల నిర్మాణపనులు రోజువారీ ప్రగతిని నిరంతరం పర్యవేక్షించి, నివేదిక అందించాలని జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి డా.ఎం.వి.ఆర్.కృష్ణాజిని ఆదేశించారు.
ఈకార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, సహాయ ఇంజనీర్లు పాల్గొన్నారు.