ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీలో చోటుచేసుకున్న ఉద్రిక్తత ఘటనపై ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్మిశ్రా ఇవాళ కేంద్ర హోమంత్రి అమిత్షాతో భేటీ అయ్యారు.ఈ ఉదయం అమిత్షా నివాసానికి వెళ్లిన మిశ్రా దాదాపు అరగంటపాటు ఆయనతో సమావేశమయ్యారు. ఆయన తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ భేటీ జరిగింది. ఆదివారం చోటుచేసుకున్న ఘటనపై వివరించారు. ఉత్తర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మౌర్య లఖింపూర్ ఖేరీ పర్యటనను నిరసిస్తూ ఆదివారం రైతులు నిరసన తెలిపారు. ఆ సమయంలో నిరసనకారులపై నుంచి ఓ కారు దూసుకెళ్ళడంతో నలుగురు రైతులతో సహా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ ఈ కారులో ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఆ రోజు వాహనంలో తన కుమారుడు లేడని ఇప్పటికే పలుమార్లు మంత్రి తెలిపారు. ఆ ఘటనకు కారణమైన వాహనం తమదేనని, అయితే అందులో తన కుమారుడు లేడని తెలిపారు. పైగా ఆందోళనకారులు రాళ్లు విసరడం వల్లే వాహనం అదుపుతప్పి రైతుల మీదకు దూసుకెళ్లిందని చెప్పారు.. ఈ కేసుపై విచారణ జరుపుతామని, కుట్ర పన్నినవారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.