ఆశిష్ మిశ్రాకు అనుకూలంగా సాక్ష్యాలు
రెండు ఎఫ్ఐఆర్లు కలిపి విచారణ చేయడమేమిటి..?
‘లఖింపూర్’ రైతుల హత్య కేసు దర్యాప్తులో పురోగతి ఏదీ..
యూపీ ప్రభుత్వాన్ని నిందించిన సుప్రీం కోర్టు
న్యూదిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లఖింపూర్ ఖేరీ రైతుల హత్య కేసు దర్యాప్తుపై సుప్రీం కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇటీవలి వారాల్లో న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేయడం ఇది మూడవసారి. ‘మేము రాజకీయ భావాలను జోడిరచదలచుకోలేదు. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తిని కేసును పర్యవేక్షించనివ్వండి’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. కేసు దర్యాప్తులో పురోగతి కొరవడటంపై ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాన్ని నిందించారు. ‘మేము ఆశించిన రీతిలో జరగడం లేదు. మరికొంతమంది సాక్ష్యులను విచారణ చేశామని చెప్పడం మినహా స్టేటస్ నివేదికలో ఏమీ లేదు. 10 రోజుల సమయం ఇచ్చాము. ల్యాబ్ రిపోర్టులు కూడా రాలేదు’ అని ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఎంత మందిని, ఏ ఆరోపణలపై అరెస్టు చేశారో స్టేటస్ రిపోర్టులో జాబితా చేయాలని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని ఆయన ఆదేశించారు. ఈ కేసులో రెండు ఎఫ్ఐఆర్లను కలిపి విచారణ చేయడాన్ని చూస్తుంటే ప్రధాన నిందితుడు ఆశిష్ మిశ్రాను రక్షించే లక్ష్యంతో ఉన్నట్లు కనిపిస్తోందని, రెండు ఎఫ్ఐఆర్లను వేర్వేరుగా విచారణ చేయాలని పేర్కొంది. అక్టోబర్ 3న లఖింపూర్ ఖేరీలో రైతుల మీదకు కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు అశిష్ మిశ్రా ప్రయాణిస్తున్న వాహనాన్ని ఎక్కించడంతో మొత్తం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత చెలరేగిన హింసలో మరికొంతమంది మరణించారు. కాగా హింసాకాండలో మరణించిన బీజేపీ కార్యకర్తల కుటుంబాల ఫిర్యాదుపై సుప్రీం కోర్టు.. ఓ జర్నలిస్టు సహా మరో నలుగురి హత్యపై ప్రత్యేక నివేదిక ఇవ్వాలని యూపీ ప్రభుత్వాన్ని కోరింది. ఈ కేసులో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పురోగతిపై సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసిన మూడు రోజుల తర్వాత, అక్టోబర్ 11న ఆశిష్ మిశ్రాను అరెస్టు చేశారు. ‘రెండు ఎఫ్ఐఆర్లను కలిపి విచారణ చేయడం ద్వారా ఒక నిర్దిష్ట నిందితుడికి ప్రయోజనాలు ఇస్తున్నట్లు ప్రాథమికంగా కనిపిస్తోందని చెప్పడానికి చింతిస్తున్నాము’ అని న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్ వ్యాఖ్యానించారు. రెండు ఎఫ్ఐఆర్లను విడివిడిగా విచారణ చేయాల్సి ఉందని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. ‘ఈ ఎఫ్ఐఆర్లలో ఒకటి రైతులది కాగా, మరొకటి జర్నలిస్టు, రాజకీయ కార్యకర్తలది. ప్రధాన నిందితుడికి అనుకూలంగా ఉన్న సాక్ష్యుల వాంగ్మూలాలు నమోదయ్యాయి’ అని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. ‘రెండు ఎఫ్ఐఆర్లు కలిపి ఉన్నాయని, ఒక ఎఫ్ఐఆర్లో సేకరించిన సాక్ష్యాలను మరొక ఎఫ్ఐఆర్లో ఉపయోగిస్తున్నారు’ అని న్యాయమూర్తి అన్నారు. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం తరఫున హాజరయిన హరీష్ సాల్వే వాదిస్తూ, ఎఫ్ఐఆర్లను విడిగా విచారణ చేసే ప్రయత్నం చేసినట్లు తెలిపారు. ‘అయితే కొన్నిసార్లు సాక్షులను ఒక ఎఫ్ఐఆర్ గురించి మాట్లాడటానికి పిలిస్తే, వారు రెండవ ఎఫ్ఐఆర్ సంఘటనలను ప్రస్తావించడంతో విచారణ క్లిష్టమవుతోంది’ అని అన్నారు. అలాగే ఆ రోజు మరణించిన జర్నలిస్టు రమణ్ కశ్యప్.. కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రాకు సంబంధించిన వ్యక్తో కాదో అనేది కూడా తెలియపోవడంతో ఈ గందరగోళం చోటుచేసుకుందని సాల్వే వివరించారు. దీనికి న్యాయమూర్తి సూర్య కాంత్ ఘాటుగా స్పందించారు. ‘రెండు ఎఫ్ఐఆర్లకు సంబంధించిన సాక్ష్యాధారాలను విడివిడిగా నమోదు చేయాలని నిర్ధారించుకోవడానికి, రోజువారీ దర్యాప్తును పర్యవేక్షించడానికి వేరే హైకోర్టు మాజీ న్యాయమూర్తిని నియమించాలని మేము భావిస్తున్నాం.
మీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి న్యాయమూర్తిని మేము కోరుకోవడం లేదు’ అని వ్యాఖ్యానించారు. గత విచారణలో అక్టోబర్ 3న జరిగిన హింసకు సంబంధించి ‘కేవలం 23 మంది ప్రత్యక్ష సాక్ష్యులు మాత్రమే ఎందుకు ఉన్నారని సుప్రీం కోర్టు యూపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మరిన్ని సాక్ష్యాలను సేకరించి వారికి రక్షణ కల్పించాలని ఆదేశించింది. అక్టోబరు 3న జరిగిన నిరసనలో నలుగురు రైతుల పైకి ఆశిష్ మిశ్రా ప్రయాణిస్తున్న వాహనం దూసుకువెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయి. అనేక వీడియోలు ఎస్యూవీ వాహనం రైతుల సమూహం వైపునకు దూసుకుపోయినట్లు చూపాయి. కాగా న్యాయమూర్తులు సోమవారం జరిపిన విచారణ సందర్భంగా సంఘటనా స్థలంలో ఆ రోజు ఎన్ని మొబైల్ ఫోన్లను గుర్తించారని ప్రశ్నించారు. ‘మీరు ఒక నిందితుడి ఫోన్ను మాత్రమే గుర్తించారు. మిగతా వారి సంగతేంటి?’ అని జస్టిస్ హిమా కోహ్లీ ప్రశ్నించారు. ‘మిగతా నిందితుల్లో ఎవరి వద్ద వారి ఫోన్లు లేవని మీరు చెబుతున్నారా?’ అని అన్నారు. హరీష్ సాల్వే బదులిస్తూ, ‘ప్రత్యక్ష సాక్ష్యులు ఉన్నారు. ఈ నిందితులు సంఘటనా స్థలంలో ఉన్నారని సీసీ టీవీ ఫుటేజీ ద్వారా రుజువు ఉంది’ అని తెలిపారు.