Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

మళ్లీ ఇలాంటివి రిపీట్‌ అయితే ఊరుకునేది లేదు : బాలకృష్ణ

టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబంపై వైసీపీ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలపై నటుడు, హిందూపరం ఎమ్మెల్యే బాలకృష్ణ, నందమూరి కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. బాలకృష్ణ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. నిన్న శాసనసభలో చోటుచేసుకున్న ఘటనలను తీవ్రంగా ఖండిరచారు. ‘చట్టసభల్లో ఉండి ఇలాంటి మాటలా… అసెంబ్లీలో ఉన్నామో..పశువుల దొడ్డిలో ఉన్నామో అర్ధం కావడం లేదు’ అంటూ బాలకృష్ణ మండిపడ్డారు.‘అసెంబ్లీలో సవాళ్లు, ప్రతిసవాళ్లు ఆనవాయితే. అయితే కుటుంబ సభ్యులపై దాడి సరికాదు. మేం వ్యక్తిగతంగా ఎప్పుడూ విమర్శించలేదు. మా సోదరిపై వ్యక్తిగత విమర్శలు చేయడం బాగాలేదని అన్నారు. ఇన్నాళ్లూ సహించాం భరించాం..ఎప్పుడైనా ఆవేశం వస్తే చంద్రబాబు ఆలోచించి మమ్మల్ని ఆపేవారు’ అని చెప్పారు. విర్రవీగి మాట్లాడేవారు ఇకపై నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. ఇక సహించం. ఫ్యామిలీని టచ్‌ చేసి చూశారు..ఇక ఇంకోసారి..మరోసారి..మళ్లీ ఇలాంటివి రిపీట్‌ అయితే ఊరుకునేది లేదన్నారు. ప్రజల తరపున, పార్టీ తరపున నా అభిమానుల తరపున ఇదే నా హెచ్చరిక. మళ్లీ ఇలాంటి నీచ, నికృష్టపు మాటలు మాట్లాడితే సహించేది లేదు. ఖబడ్డార్‌..భరతం పడతాం అని హెచ్చరించారు. రామకృష్ణ మాట్లాడుతూ, ‘ఏపీలో రాజకీయ పరిణామాలు చూస్తే బాధేస్తోంది. మా కుటుంబం జోలికి ఎవరొచ్చినా వదిలిపెట్టం. ఇలాంటి పరిణామాలు ఏ కుటుంబానికి జరగకూడదు.’ అని అన్నారు. హరికృష్ణ కుమార్తె సుహాసిని మాట్లాడుతూ, రాజకీయాలు రాజకీయంగానే ఉండాలిగాని కుటుంబ విషయాల జోలికి రావడం మంచిది కాదని అన్నారు. తెలుగువారందరూ ఈ ఘటనను ఖండిచాలన్నారు. లోకేశ్వరి మాట్లాడుతూ, అసెంబ్లీ అంటే దేవాలయంతో సమానం. కొందరు ఇష్టమొచ్చినట్లు మాట్లాడి దాన్ని అపవిత్రం చేశారని ఆన్నారు. ‘మాలో ఎన్టీఆర్‌ రక్తం ఉంది. మళ్లీ ఇలా జరిగితే విశ్వరూపం చూస్తారు.’ అని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img