Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

ఈ నెల 29 నుండి భూ హక్కు చట్టం అమలు

…- ఏ .పి.రిజిస్ట్రేషన్ కమీషనర్, ప్రభుత్వ జి.ఒ. 303 విడుదల … – ముందుగా ఎంపిక చేసిన 16 రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు …

విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : తే.27.04.2024ది. భూ హక్కు చట్టం (లాండ్ టైటిలింగ్ యాక్టు)ను ఈ నెల 29 నుండి ఎంపిక చేసిన 16 రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు చేయాలని ఏ.పి.రిజిస్ట్రేషన్ కమీషనర్ ప్రభుత్వ జి.ఓ. 303, తే.11.07.2023ది.తో స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం సోమవారం నుండి ఎంపిక చేసిన 16 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో
స్థిరాస్తుల కొనుగోలుదారులకు ఒరిజినల్ దస్తావేజులు కాకుండా కేవలం జిరాక్స్ కాపీలు మాత్రమే ఇచ్చేందుకు ఆదేశాలు జారీ చేశారు. … టైటిలింగ్ యాక్ట్ పెనుభూతం కోరలనుంచి మీ ఆస్తులను, మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటూ ఏ.పి.రైతు సంఘం, న్యాయవాదుల బార్ అసోసియేషన్ ఆధ్వర్య0లో చేసిన పలు ప్రజా పోరాటాలను తోసి రాజంటూ ఎట్టకేలకు లాండ్ టైటలింగ్ యాక్టు ను ప్రభుత్వ జి.ఓ.తో అమ్మల్లోకి తీసుకురావడం పట్ల సర్వత్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకమైన భూ హక్కుల చట్టం అన్ని వర్గాల ప్రజల పాలిట యమపాశం కాబోతుందని భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా సమితి సభ్యుడు, ఏ.పి.రైతు సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు తెలియజేశారు. దీనిపై కమ్యూనిస్ట్ నాయకుడు రెడ్డిపల్లి శనివారం విలేఖరులతో మాట్లాడుతూ ప్రజలను మభ్యపెట్టే చట్టాలపై మరో ప్రజా పోరాటం తప్పదని, ఈ చట్టంపై ప్రజలందరూ అవగాహన కలిగి ఉండాలి అని తెలిపారు.
స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్ల పాటు ప్రజలతో మమేకమై సేవలు చేసిన రిజిస్ట్రేషన్ వ్యవస్థ, రెవిన్యూ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఇక ముందు మూతపడబోతున్నాయి అన్నారు. టైటిలింగ్ చట్టం ప్రకారం భూ ప్రాధికార సంస్థ, టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి (టి.ఆర్.ఒ.) నియమితమైన తరువాత ప్రజల తాలూకు స్థిరాస్తులన్నీ అట్టి టి.ఆర్. ఒ. పరిధిలోకి పోతాయిని,
మీ అమ్మాయికి మీరు పొలం ఇస్తూ దానపట్టా దస్తావేజు వ్రాయించాలంటే టి.ఆర్.ఓ. నుంచి అనుమతి పొందాలి అని తెలిపారు.
కనీసం మీ అవసరాలకి మీ ఆస్తి అమ్ముకోవాలంటే టి.ఆర్.ఒ.అనుమతి కావాలి అని, మీరు బాకీ రాబట్టుకోవడానికి కోర్టు నుంచి తనఖా, డిక్రీ పొందితే దాన్ని టి.ఆర్.ఒ. దగ్గర తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలన్నారు. డిక్రీని అమలు పరచమని కోర్టుకు వెళ్లాలంటే టి.ఆర్.ఒ. నుండి నిరభ్యంతర పత్రం తీసుకోవాలన్నారు. స్థిరాస్తి కొనుక్కుంటే రిజిస్ట్రేషన్ చేయించుకున్న తరువాత, దాన్ని టి.ఆర్.ఒ. దగ్గర తిరిగి నమోదు చేయించుకోవాలని, మీ ఆస్తికి సంబంధించి టి.ఆర్.ఒ. చేసినదే తుది నిర్ణయమన్నారు. దానిని మీరు సాధారణ సివిల్ కోర్టులో సవాలు చేయడం కుదరదని, మీ ఆస్తిని గాని టి.ఆర్.ఒ. ఎట్టి పరిస్థితులలోనైనా తన వద్దనున్న వివాదాల నమోదు రిజిస్టర్ లో కనుక చేర్చినట్లైతే సదరు చేరికను మీరు హై కోర్టులో తప్ప క్రింది కోర్టులలో సవాలు చేయడానికి వీలుకాదని తెలియజేశారు. టి.ఆర్.ఒ. నియమితమైన తరువాత పెండింగులో ఉన్న దావాలను కూడా ఆయన పరిధిలో ఉంచి, నమోదు చేయించుకోవాలని, మీకు బిన్నంగా ఏదైనా కోర్టు తీర్పు వచ్చిన తరువాత ఆ తీర్పును పై కోర్టులో అప్పీల్ చేయాలనుకుంటే టి.ఆర్.ఒ. దగ్గర ముందు నమోదు చేయించుకుని, ఆ ధృవపత్రాన్ని అప్పీలుతో జతపరచి మాత్రమే అప్పీలు చేసుకోగలుగుతారని తెలిపారు. పై సందర్భాల్లో టి.ఆర్.ఒ. గనుక మీ వివాదాన్ని నమోదు చేసి సర్టిఫికెటు ఇవ్వకపోయినట్లైతే మీరు వేసిన దావాకాని, అప్పీలు కానీ చెల్లకుండా పోతాయిన్నారు.
మీ ఆస్తికి సంబంధించి మీరెవరికైనా పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తే సదరు విషయాన్ని టి.ఆర్.ఒ. దగ్గర నమోదు చేయించుకోవాలని, ప్రజలు కష్టపడి సంపాదించుకున్న మీ ఆస్తికి సంబంధించి ఇక ముందు మీరు ప్రతిక్షణం టి.ఆర్.ఒ. కనుసన్నల్లో బ్రతకాల్సుంటుందని తెలిపారు. టి.ఆర్.ఒ. మాత్రం స్థానిక శాసనసభ్యుడు లేదా పార్లమెంట్ సభ్యుడు చేతిలో ఉంటాడని, అధికార పార్టీకి కొమ్ముకాస్తూ ఇక ముందు ప్రతీ పౌరుడు బ్రతుకు బానిస బ్రతుకుగా మారిపోబోతుందని తెలియజేశారు. వీటి కారణంగా రిజిస్ట్రేషన్ సిబ్బంది, రెవిన్యూ సిబ్బంది, కోర్టు సిబ్బంది, న్యాయవాదులు అందరూ కలిసి లక్ష మందికి పైగా చేయలేని పనుల్ని ప్రభుత్వం నియమించబోయే, ఏ మాత్రం న్యాయ పరిజ్ఞానం లేని ఐదు లేక ఆరు వందలమంది టి. ఆర్.ఒ. లు చక్కబెడతారని అన్నారు. పనికి మాలిన, అర్థం లేని చట్టాలతో ప్రజల బ్రతుకల్ని బానిసగా మార్చే అధికారం నుండి విముక్తి పొందాలని, మరిన్ని ప్రజా ఉద్యమాలతో అధికార ప్రభుత్వానికి బుద్ది చెబుతామని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img