ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు..
న్యూదిల్లీ : కేంద్రంలోని బీజేపీ తన ప్రజావ్యతిరేక విధానాలను కొనసాగిస్తూనే ఉంది. ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటుపరం చేసే బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టనుంది. ఈ సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న మొత్తం 26 బిల్లుల్లో బ్యాంకింగ్ చట్టసవరణ బిల్లు కూడా ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడిరచాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటుపరం చేసేందుకుగానూ 1970, 1980 బ్యాంకింగ్ కంపెనీల చట్టంతో పాటు 1949 బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్కు సవరణలు చేయడమే బిల్లు ఉద్దేశమని పేర్కొన్నాయి. బిల్లు ప్రవేశ పెట్టడం, పరిశీలన, ఆమోదం కోసం జాబితా అయినట్లు అధికారిక వర్గాలు వెల్లడిరచాయి. రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ సహా పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.లక్షా 75 వేల కోట్లు సమీకరించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ సమావేశాల్లో మరో కీలకమైన పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ చట్ట సవరణ బిల్లు కూడా ప్రవేశపెట్టనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.