సినిమా టికెట్ల అంశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పునరాలోచన చేయాలని మెగాస్టార్ చిరంజీవి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అయన ట్వీట్ చేశారు. పరిశ్రమ కోరిన విధంగా పారదర్శకత కోసం ఆన్లైన్ టిక్కెటింగ్ బిల్ ప్రవేశపెట్టడం హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు. థియేటర్ల మనుగడ, సినిమానే ఆధారంగా చేసుకున్న ఎన్నో కుటుంబాల బతుకుతెరువు కోసం టికెట్ ధరలను కాలానుగుణంగా, సముచితంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న విధంగా నిర్ణయిస్తే పరిశ్రమకు మేలు జరుగుతుందని వివరించారు. ‘దేశమంతా ఒకటే జీఎస్టీగా పన్నులను ప్రభుత్వం తీసుకుంటున్నట్లు టికెట్ ధరల విషయంలో కూడా అదే వెసులుబాటు ఉండటం సమంజసం. దయచేసి ఈ విషయంపై పునరాలోచన చేయండి. ఆ ప్రోత్సాహం ఉన్నప్పుడే తెలుగు పరిశ్రమ నిలదొక్కుకోగలుగుతుంది’ అని చిరంజీవి పేర్కొన్నారు.