భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో తీవ్రంగా గాయపడిన కెప్టెన్ వరుణ్సింగ్ ఇవాళ ఉదయం బెంగళూరులోని ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని భారత వాయుసేన ట్విట్టర్ వేదికగా వెల్లడిస్తూ విచారం వ్యక్తం చేసింది. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది. వరుణ్సింగ్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తంచేశారు. ‘గ్రూప్ కెప్టెన్ వరుణ్సింగ్ శౌర్య పరాక్రమాలతో దేశానికి సేవ చేశారు. ఆయన మృతి పట్ల తీవ్ర వేదనకు లోనయ్యా. దేశానికి ఆయన చేసిన సేవ ఎప్పటికీ మరువలేనిది. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నా.’ అని మోదీ ట్వీట్ చేశారు. ఈ నెల 8వ తేదీన జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో వరుణ్ సింగ్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో బిపిన్ రావత్ దంపతులు సహా మొత్తం 14 మంది ప్రయాణిస్తున్న హెలికాప్టర్కు కూనూర్ సమీపంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటికే 13 మంది మరణించారు.