అహ్మదాబాద్: గుజరాత్లోని పాఠశాలల్లో గడచిన 27 సంవత్సరాలుగా బీజేపీ ఎలాంటి మార్పులు, చేర్పులు చేసిందో తాను పరిశీలించనున్నట్లు దిల్లీ విద్యాశాఖమంత్రి మనీశ్ సిసోడియా తెలిపారు. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సందర్భంగా గుజరాత్లోని భావనగర్ జిల్లాలో ఓ పాఠశాలను పరిశీలించిందుకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ దిల్లీలోని పాఠశాలల్లో ఎలాంటి మార్పులు చేసిందో, అదే తరహా గుజరాత్లోనూ మార్పులు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చింది. అలాగే 182 స్థానాల్లోనూ పోటీ చేసేందుకు సిద్ధమని, పాలక బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ల కన్నా అభివృద్ధి ఏ విధంగా చేస్తోమో చూడాలంటూ సవాల్ విసురుతోంది. సోమవారం మనీశ్ సిసోడియా అహ్మదాబాద్ చేరుకుని గుజరాత్ విద్యాశాఖ మంత్రి జితు వాఘని సొంత నియోజకవర్గమైన భావనగర్కు చేరుకున్నారు. సిసోడియా ఇటీవల పాఠశాల విద్యపై ఓ సమావేశంలో మాట్లాడుతూ అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఆప్ ప్రభుత్వం హయంలో పాఠశాల విద్యలో వచ్చిన మార్పులను ఊటంకిస్తూ సవాల్ విసిరారు. ‘అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రభుత్వ పాఠశాలల రూపురేఖల్లో గణనీయమైన మార్పులు వచ్చాయి. 27 ఏళ్లుగా గుజరాత్లో బీజేపీ అధికారంలో ఉంటోంది. ఈ 27 సంవత్సరాల్లో అసలు పాఠశాలల రూపురేఖల్లో ఎలాంటి మార్పులు వచ్చాయో నేను పరిశీలించాలి’ అని సిసోడియా తెలిపారు.