భోపాల్: మధ్యప్రదేశ్లోని ఖర్గోన్లో శ్రీరామ నవమి సందర్భంగా జరిగిన హింసాకాండపై తాను ఇచ్చిన ట్వీట్లో జత చేసిన ఫొటో మాత్రమే తప్పు అని కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు దిగ్విజయ్ సింగ్ చెప్పారు. ఈ ట్వీట్లో తాను ప్రశ్నలు మాత్రమే సంధించానని తెలిపారు. ఆ ఫొటో ఖర్గోన్కు సంబంధించినది కానందువల్లే తాను ఈ పోస్ట్ను డిలీట్ చేశానన్నారు. శ్రీరామ నవమి శోభాయాత్ర సందర్భంగా మధ్యప్రదేశ్లోని రెండు జిల్లాల్లో హింసాకాండ చెలరేగింది. ఖర్గోన్లో ఈ శోభాయాత్రలో పాల్గొన్నవారిపై ఓ వర్గానికి చెందినవారు రాళ్లు విసిరి, బీభత్సం సృష్టించారు. ఈ సంఘటనపై స్పందిస్తూ దిగ్విజయ్ సింగ్ ఇచ్చిన ట్వీట్పై విమర్శలు వస్తున్నాయి. ఆయనపై మధ్య ప్రదేశ్లోని గ్వాలియర్, జబల్పూర్, నర్మదపురం, సాత్నాలలో ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. దీనిపై దిగ్విజయ్ సింగ్ బుధవారం ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ తాను ఇచ్చిన ట్వీట్లో కేవలం ప్రశ్నలు మాత్రమే సంధించానని చెప్పారు. ఈ ట్వీట్తో జత చేసిన ఫొటో ఖర్గోన్కు సంబంధించినది కానందువల్లే తాను డిలీట్ చేశానన్నారు. తనపై లక్ష ఎఫ్ఐఆర్లు దాఖలైనా తాను మతతత్వంపై ప్రశ్నలు సంధించడం మానబోనని చెప్పారు. దిగ్విజయ్ సింగ్ మంగళవారం ఇచ్చిన ట్వీట్లో కర్రలు, కత్తులు వంటి ఆయుధాలు పట్టుకుని ప్రదర్శన నిర్వహించడానికి ఖర్గోన్ అధికార యంత్రాంగం అనుమతి ఇచ్చిందా? రాళ్లు విసిరినవారు ఏ మతానికి చెందినవారైనప్పటికీ, వారి ఇళ్లపై నుంచి బుల్డోజర్లు వెళ్తాయా? నిష్పక్షపాతంగా ప్రభుత్వాన్ని నడుపుతామని ప్రమాణం చేసిన విషయాన్ని మర్చిపోవద్దు శివరాజ్ గారూ అని పేర్కొన్నారు. దీనికి ఆయన బీహార్లోని ముజఫర్పూర్లో జరిగిన సంఘటనకు సంబంధించిన ఫొటోను జత చేశారు.