వారం రోజుల్లో పోలీస్ ఉద్యోగల భార్తీకి నోటిఫికేషన్ వస్తున్నదని, సిద్ధంగా ఉండాలని ఉద్యోగార్థులకు మంత్రి హరీశ్ రావు తెలిపారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం భర్తీ చేస్తున్న 80 వేలకుపైగా ఉద్యోగాల్లో 20 వేల ఖాళీలు పోలీస్ శాఖలోనే ఉన్నాయని చెప్పారు. పటాన్చెరూలో సంగారెడ్డి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎస్ఐ, కానిస్టేబుల్ శిక్షణ తరగతులను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. సమయాన్ని వృధా చేయకుండా చదువుకొని అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. దేశంలో పోలీస్ ఉద్యోగాల్లో 33శాతం రిజర్వేషన్ కల్పించిన.. ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని పేర్కొన్నారు.95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా రిజర్వేషన్లు కల్పిస్తున్నామని తెలిపారు.రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేస్తున్నామని, కేంద్రంలో 15 లక్షలకుపైగా ఉద్యోగాలను ఎప్పుడు భర్తీ చేస్తారో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. ధరలు పెంచినందుకు, ఉద్యోగాలు ఇవ్వనందుకు, ప్రజల జీవితాలను ఆగం చేస్తున్నందుకు యాత్ర చేస్తున్నారా అని ప్రశ్నించారు. ఉద్యోగాల భర్తీ గురించి తెలంగాణ విద్యార్థులు బీజేపీని ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు. ట్విటర్ వేదికగా ప్రధాని మోదీ, బండి సంజయ్, కిషన్ రెడ్డిలను ప్రశ్నించాలన్నారు. విద్యార్థుల కోరిక మేరకు సీఎం కేసీఆర్ మూడేండ్ల వయోపరిమితి సడలింపు ఇచ్చారన్నారు.