ప్రపంచ కుబేరుడు, టెస్లా సంస్థ అధినేత ఎలాన్ మస్క్..తన సంస్థ ఉద్యోగులకు చివరి హెచ్చరిక జారీ చేశారు. ఇకపై ఇంటి నుంచి పనిచేస్తామంటే కుదరదని, కార్యాలయానికి రావాల్సిందేనని అల్టిమేటం జారీ చేశారు. ఆఫీసుకు రాలేమంటే కనుక ఇకపై ఇంటికే పరిమితం కావొచ్చని హెచ్చరించారు. ఈ మేరకు ఉద్యోగులకు ఈ-మెయిల్స్ పంపించారు. ఇంటి నుంచి పనిచేయడం ఇక నుంచి కుదరదని, అది ఆమోదయోగ్యం కూడా కాదని ఆ ఈ-మెయిల్స్లో పేర్కొన్న మస్క్.. ఒకవేళ ఎవరైనా వర్క్ ఫ్రం హోం చేయాలని అనుకున్నా వారానికి 40 గంటలు కార్యాలయంలో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. అది కూడా కుదరదనుకుంటే కనుక భేషుగ్గా ఉద్యోగాన్ని వదులుకోవచ్చని పేర్కొన్నారు. ఆఫీసు అంటే అది ప్రధాన కార్యాలయమేనని, విధులకు సంబంధం లేని ఇతర బ్రాంచీ కాదని మస్క్ తేల్చి చెప్పారు. ఎలాన్ మస్క్ నుంచి వచ్చిన ఈ ఈ-మెయిల్ హెచ్చరిక ఇప్పుడు ట్విట్టర్లో వైరల్ అవుతోంది. టెస్లా ఉద్యోగుల్లో ఇప్పుడిది తీవ్ర చర్చనీయాంశమైంది.