వేసవి సెలవుల అనంతరం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కొత్త ఉత్సాహంతో కేసుల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానానికి మే 23 నుంచి జులై 10వ తేదీ వరకు వేసవి సెలవులు ఇచ్చారు. జులై 11న సుప్రీంకోర్టు పునఃప్రారంభం కాగా, అదే రోజున రికార్డు స్థాయిలో తీర్పులు వెలువడడం విశేషం. సుప్రీంకోర్టు ఒక్కరోజులోనే 44 తీర్పులిచ్చింది. ఈ మధ్య కాలంలో ఒకే రోజున ఇన్ని తీర్పులివ్వడం ఇదే ప్రథమం. కాగా, ఈ కేసుల్లో కోర్టు ధిక్కారం, బ్యాంకింగ్, వ్యాపార వివాదాలు, దేశీయ చట్టాలు, నేరస్థుల అప్పగింత ఒప్పందాలు, కాంట్రాక్టులు, సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఈ కేసుల్లో ఒక్క జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనమే 20 తీర్పులను వెలువరించింది.