బీమా కోరేగావ్ కేసులో నిందితుడిగా ఉన్న పౌర హక్కుల సంఘం నేత వరవరరావు బెయిల్ పిటిషన్పై మంగళవారం సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తన అనారోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మెడికల్ గ్రౌండ్స్ కింద తనకు బెయిల్ ఇవ్వాలంటూ వరవరరావు ఇటీవలే బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా… పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ పిటిషన్పై మంగళవారం విచారణ జరిగింది. సోమవారం జరిగిన విచారణలో వరవరరావు తరఫు వాదనల అనంతరం ప్రభుత్వం తరఫు న్యాయవాదిగా హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అవసరమైన పత్రాల సమర్పణకు ఒక రోజు గడువు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు. దీంతో విచారణను కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. తాజాగా మంగళవారం నాటి విచారణలో ఇరు పక్షాల న్యాయవాదులు మరింత సమయం కావాలని కోరడంతో విచారణను కోర్టు ఈ నెల 19కి వాయిదా వేసింది.