విశాలాంధ్ర`పొన్నూరు : పొన్నూరు అర్బన్ పోలీస్ స్టేషన్లో శనివారం సీఐ శరత్ బాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలైన జూదం, గ్యాంబ్లింగ్, వ్యభిచారం, క్రికెట్ బెట్టింగ్, గంజాయి అమ్మకం, గుట్కా, ఖైని తదితర ప్రభుత్వ నిషేధ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా బృందాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. గతంలో 10 కేసులు నమోదు చేశామన్నారు. ముఖ్యంగా యువత గంజాయి మత్తుకు దూరంగా ఉండాలని సూచించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేసేవారిని ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజల ఆరోగ్య దృష్ట్యా పోలీసు వారికి ప్రజలతోపాటు మీడియా ప్రతినిధులు సహకరించాలని ఆయన కోరారు. సమావేశంలో ఎస్సై ప్రసాద్, కానిస్టేబుల్ మురళి పాల్గొన్నారు.