Tuesday, May 7, 2024
Tuesday, May 7, 2024

అమరావతి పాదయాత్ర కాదు
దిల్లీ యాత్ర చేపట్టాలి

రాజధాని నిర్మాణానికి నిధులు రాబట్టాలి
బీజేపీ నేతలను డిమాండ్‌ చేసిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : అమరావతి నిర్మాణంపై బీజేపీ కపటనాటకాలు కట్టిపెట్టాలని, అమరావతి పాదయాత్రను మానుకొని ఢల్లీి యాత్ర చేపట్టి, రాజధాని నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు రాబట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ శనివారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. మన అమరావతి పాదయాత్ర పేరుతో బీజేపీ మరో డ్రామాకు తెరలేపిందనీ, బీజేపీ డ్రామాలను గుర్తించిన అమరావతి రైతులు వైసీపీ, బీజేపీలు తోడుదొంగలనే నిజాన్ని బయటపెట్టారన్నారు. అధికారంలోకి వస్తే రెండేళ్లలో అమరావతి రాజధానిని నిర్మిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పటం కప్పదాటు వైఖరికి నిదర్శనంగా పేర్కొన్నారు. ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తుందని సోము వీర్రాజు పగటి కలలు కంటున్నారనీ, నిజంగా అమరావతి నిర్మాణంపై బీజేపీ రాష్ట్ర నాయకులకు చిత్తశుద్ధి ఉంటే గత మూడేళ్లుగా కేంద్రం నుంచి ఎందుకు నిధులు రాబట్ట లేకపోయారని ప్రశ్నించారు? ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన అమరావతి నిర్మాణాన్ని జగన్మోహన్‌ రెడ్డి అడ్డుకుంటే ఏపీ బీజేపీ నేతలు మూడేళ్లుగా చోద్యం చూస్తున్నారా? అమిత్‌ షా తో జగన్మోహన్‌ రెడ్డికి ఒక్క ఫోన్‌ చేయిస్తే అమరావతి రాజధాని నిర్మాణం జరక్కుండా ఉంటుందా? అమరావతి రైతులు, మహిళలపై జగన్‌ సర్కార్‌ అక్రమ కేసులు, దాడులు, బెదిరింపులు, అరెస్టులు, జైళ్లకు పంపడం వంటివి చేసినప్పుడు ఏపీ బీజేపీ నేతలు నిద్రపోయారా? అని ప్రశ్నించారు. ఇకనైనా ఏపీ బీజేపీ నేతలు కపట నాటకాలు కట్టిపెట్టాలనీ, అమరావతి ప్రజలు మరోసారి బీజేపీ చేతిలో మోసపోవడానికి సిద్ధంగాలేరన్నారు. అసత్య ప్రచారాలతో ఏపీ బీజేపీ చేసే అమరావతి పాదయాత్రను మానుకుని దిల్లీ యాత్రను చేపట్టాలన్నారు. అమిత్‌ షాను కలిసినప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు గురించి మాట్లాడాలనీ, ఇప్పటికైనా ఏపీ బీజేపీ నేతలకు చేతనైతే అమిత్‌ షా తో జగన్‌మోహన్‌ రెడ్డికి ఒక్క ఫోన్‌ చేయించండి. అమరావతి రాజధాని నిర్మాణం ఎందుకు జరగదో చూస్తామని రామకృష్ణ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img