బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్రలో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. జనగామ జిల్లాలోని దేవరుప్పుల మండల కేంద్రం నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర సోమవారం ఉదయం ప్రారంభించారు. అయితే, దేవరుప్పుల మండలంలోకి స్థానిక బీజేపీ కార్యకర్తలు బండి సంజయ్కు ఘనంగా స్వాగతం పలికారు. ఆ పార్టీకి చెందిన యువకులు బాణసంచా కాలుస్తూ బండి సంజయ్ను ఆహ్వానించారు. అనంతరం దేవరుప్పలలో నిర్వహించిన బహిరంగ సభలో బండి సంజయ్ మాట్లాడారు.ఈ సమయంలోనే బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. అది క్రమంగా ఘర్షణకు దారి తీసింది. పాలకుర్తి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ఎవరికీ సీఎం కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వలేదని బండి సంజయ్ మాట్లాడుతూ విమర్శలు చేశారు. అదే సమయంలో అక్కడ ఉన్న కొంతమంది టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు బండి సంజయ్ వ్యాఖ్యలతో విభేదించారు. వారు బీజేపీ కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు. గట్టిగా నినాదాలు చేస్తూ బండి సంజయ్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. దీంతో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిందని టీఆర్ఎస్ నేతలు నిలదీశారు. దీంతో ఇరువర్గాల మధ్య మాట మాట పెరగడంతో అది దాడులకు దారి తీసింది. ఒక వర్గంపై మరో వర్గం రాళ్ల దాడి కూడా చేసుకున్నారు. ఈ ఘర్షణలో కొంత మంది బీజేపీ, టీఆర్ఎస్ నేతలకు గాయాలయ్యాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. చివరికి వారిని అదుపు చేశారు. ఈ రాళ్ల దాడిలో కొందరు నేతల తలలు పగిలిపోయాయి. వారికి రక్తం కారడంతో అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు.
సీపీపై బండి సంజయ్ ఫైర్
ఈ ఘటనపై జిల్లా సీపీని బండి సంజయ్ విమర్శించారు. ఇంత జరుగుతుంటే ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను బండి సంజయ్ ట్విటర్లో పెట్టారు. ఆ తర్వాత కాసేపటికే దాన్ని డిలీట్ చేశారు.