కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వంపై మంత్రి హరీశ్ రావు మరోసారి ఫైర్ అయ్యారు. తెలంగాణలో ఉన్న పథకాలు.. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయ అని ప్రశ్నించారు. ఉచితాలు వద్దని అనుచిత వ్యాఖ్యలు చేసే బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో తప్ప బీజేపీ, కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రూ.2016 పెన్షన్ ఇవ్వడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగే అభివృద్ధిని చూసి ఓర్వలేకే.. బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. తెలంగాణలో అమలు చేసే అనేక పథకాలు.. ఇతర రాష్ట్రాల్లో ఎందుకు లేవని ప్రశ్నించారు. ఎవరెన్ని చేసినా.. తెలంగాణ అభివృద్దిని అడ్డుకోలేరని వ్యాఖ్యానించారు.సిద్ధిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం రామంచలో.. 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదామును మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. అనంతరం టీహెచ్ఆర్ పల్లె ప్రకృతి వనం, మంకీ ఫుడ్ కోర్టును ప్రారంభించారు. ఆ తర్వాత నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. భవిష్యత్తులో తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోవడం ఖాయమని హరీశ్ వ్యాఖ్యానించారు.