జాతీయ లోక్ అదాలత్లో న్యాయమూర్తుల పిలుపు
విశాలాంధ్ర` కళ్యాణదుర్గం : కక్షలు, కార్పణ్యాలకు వెళ్లకుండా రాజీ మార్గంలో వెళ్లి రాజ మార్గాన్ని అనుసరించాలని న్యాయమూర్తులు విజయ్కుమార్, శుభాన్లు సూచించారు. శనివారం అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గం జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ, చిన్న పొరపాటు, క్షణికావేశం కారణంగా గొడవలు, మనస్పర్థలు పెట్టుకొని కేసులు దాకా వెళ్ళి కోర్టుల చుట్టూ తిరిగి సమయాన్ని వృథా చేసుకోవడమే కాకుండా , ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. చిన్న చిన్న నేరాలు, దొంగతనాలు, చేసినవారు తమ తప్పు తెలుసుకునేలోగా ఏళ్ల తరబడి కాలయాపన జరిగిపోతుందని అన్నారు.. భార్య భర్తలు, కుటుంబ సభ్యులు, బంధువులు తమ చుట్టూ తిరుగుతున్నారని వీటిని పెద్దల సమక్షంలో రాజీ చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు కరణం తిప్పేస్వామి, దేవేంద్ర , కృష్ణమూర్తి,, వెంకటేసులు, పట్టాభి, హరి, వాల్మీకి ప్రియాంక, సిఐ తేజోమూర్తి, ఎస్సై లు పాల్గొన్నారు.