ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం పరిస్థితులు ఉద్యోగులకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ, టెక్ కంపెనీల్లో పనిచేసే వారు మాత్రం వణికిపోతున్నారు. ఉద్యోగాలు ఎప్పుడు ఊడతాయో అన్న భయంలో కాలం వెల్లదీస్తున్నారు. అమెరికాకు చెందిన దిగ్గజ మల్టీ నేషనల్ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ కూడా లేఆఫ్స్ జాబితాలో చేరిపోయింది. తన వర్క్ఫోర్స్లో సుమారు 5 శాతం అంటే 11 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపించే ప్రణాళికలో ఉందంట. ఇప్పటికే కొందరికి మెయిల్స్ కూడా చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు యూకే బ్రాడ్కాస్టర్ స్కై న్యూస్ నివేదించింది. బ్లూమ్బెర్గ్ రిపోర్ట్ ప్రకారం.. తాజా రౌండ్ లేఆఫ్స్లో భాగంగా ఇంజినీరింగ్ డివిజన్ ఉద్యోగులు ఎక్కువగా ప్రభావితం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది. మైక్రోసాఫ్ట్ గతేడాది కూడా ఉద్యోగులను పెద్ద మొత్తంలో తీసేసింది. ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో ఆర్థిక పరిస్థితులు క్షీణిస్తుండటం, డిమాండ్ పడిపోతుండటం కారణంగా కంపెనీల ఆదాయాలు పడిపోతున్నాయి. ముఖ్యంగా టెక్ కంపెనీలు ఎక్కువగా నష్టపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఖర్చులను తగ్గించుకునేందుకు ఉద్యోగులను తీసేస్తున్నాయి. కష్టమే అయినా తప్పట్లేదని చెబుతున్నాయి. ఇప్పుడు ఇదే కారణం చెప్పింది మైక్రోసాఫ్ట్. 2022 రెండో అర్ధభాగంలో ఆర్థిక మాంద్యం భయాలు ఉద్యోగులను ఎంతలా భయపెట్టాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెద్ద పెద్ద కంపెనీలు ఊహించని విధంగా ఉద్యోగులకు రaలక్ ఇచ్చాయి. అమెజాన్ 18 వేల మందికిపైగా ఉద్యోగులను ఇంటికి పంపించగా.. మెటా 11 వేల మందిని తొలగించింది. ఇక ట్విట్టర్, యాపిల్, గూగుల్ ఏం తక్కువ తిన్లేదంటూ లేఆఫ్స్ చేశాయి. దేశీయంగా కూడా ఐటీ కంపెనీలు మరీ పెద్ద మొత్తంలో కాకున్నా.. పెర్ఫామెన్స్ బాగా లేదన్న పేరుతో కొందరిని తీసేశాయి. అన్ని రంగాలకు ఈ లేఆఫ్స్ బెడద విస్తరించింది.