ఆక్లాండ్ : టెస్టు సిరీస్లో శ్రీలంకను చిత్తు చేసిన న్యూజిలాండ్ వన్డే సిరీస్లోనూ సత్తా చాటుతోంది. ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన కివీస్ వన్డే సిరీస్ ఆరంభ మ్యాచ్లో రికార్డు విజయం సాధించింది. ఆక్లాండ్లో జరిగిన తొలి వన్డేలో 198 పరుగుల తేడాతో గెలుపొందింది. దాంతో, ఎనిమిదేళ్ల రికార్డును బ్రేక్ చేసింది. 2015 జనవరి 25న శ్రీలంకను 120 పరుగుల తేడాతో బ్లాక్క్యాప్స్ చిత్తు చేసింది. ఇప్పటివరకు ఆ జట్టుపై ఇదే న్యూజిలాండ్కు భారీ విజయం. మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ 274 రన్స్కు ఆలౌట్ అయింది. ఆ జట్టులో రచిన్ రవీంద్ర (49) టాప్ స్కోరర్. కరుణరత్నే నాలుగు వికెట్లతో రాణించాడు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకను హెన్రీ షిప్లే, బ్లెయిర్ టిక్నర్ దెబ్బకొట్టారు. షిప్లే ఐదు వికెట్లు తీసి శ్రీలంకను ఓటమి అంచుల్లోకి నెట్టాడు. అతను కీలకమకైన ప్రథుమ్ నిస్సింకా, చరిత అలసంక, కుశాల్ మెండిస్, దసున్ శనక, కరుణరత్నే లను ఔట్ చేశాడు. ఈ ఫాస్ట్ బౌలర్ ఏడు ఓవర్లలో 31 రన్స్ మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. రెండు జట్ల మధ్య కీలకమైన రెండో వన్డే మార్చి 28న క్రిస్ట్చర్చ్లో జరగనుంది.
ఆఖరి బంతికి అనూహ్యంగా
క్రిస్ట్చర్చ్లో జరిగిన మొదటి టెస్టులో కివీస్ చారిత్రాత్మక విజయం సాధించింది. ఉత్కంఠ పోరులో ఆఖరి బంతికి గెలుపొందింది. మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అసమాన పోరాటంతో ఆ జట్టు శ్రీలంకపై సంచలన విజయం నమోదు చేసింది. దాంతో, కివీస్ పోరాట పటిమకు యావాత్ క్రికెట్ ప్రపంచం సలాం కొట్టింది. ఈ టెస్టును వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్లో టాప్-5 మ్యాచుల్లో ఒకటిగా ఐసీసీ ఈమధ్యే ప్రకటించింది. రెండో టెస్టులో విలియమ్సన్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. దాంతో, కివీస్ ఇన్నింగ్స్ 58 పరుగుల తేడాతో గెలిచి 2-0తో సిరీస్ సొంతం చేసుకుంది.