విశాలాంధ్ర – విజయవాడ లీగల్: ఏపీ సీఐడీ న్యాయవాదులకు నోటీసులు జారీ చేయడాన్ని ఖండిస్తూ బెజవాడ బార్ అసోసియేషన్ (బీబీఏ) అధ్వర్యంలో న్యాయ వాదులు సోమవారం తమ విధులను బహిష్కరిం చారు. బీబీఏకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక బార్ అసోసియేషన్లకు చెందిన న్యాయవాదులు తమ ప్రాంతాలలో విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. విజయవాడలో ఇటీవల ఏపీ ప్రొఫెషనల్ ఫోరం అధ్వర్యంలో ఛార్టెడ్ అకౌంటెంట్ శ్రావణ్ కుమార్ అరెస్ట్ విషయంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న అనేక మంది న్యాయవాదులకు సీఐడీ సీఆర్పీసీ సెక్షన్ 160 ప్రకారం నోటీసులు జారీ చేసింది. కాగా, దేశ పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం ఏర్పడితే న్యాయవాదులుగా స్పందించడం తమ బాధ్యతని, నోటీసులు జారీ చేసి ప్రశ్నించే గొంతులను నొక్కేయాలని చూడడం సరికాదని బీబీఏ న్యాయవాదులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు సుంకర రాజేంద్ర ప్రసాద్, చలసాని అజయ్ కుమార్, గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్, హైకోర్టు న్యాయవాది జడ శ్రావణ్ కుమార్, బీబీఏ కార్యవర్గ సభ్యులు, అనేక మంది సీనియర్ న్యాయవాదులు పాల్గొని సీఐడీ తమ పరిధిని దాటి ప్రవర్తిస్తోందని, ఇటువంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. నోటీసులతో న్యాయవాదులను భయపెట్టలేరని, వెంటనే వాటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.