. దీనిపై 3 నెలల క్రితం తీర్పు రిజర్వు చేసిన ఏపీ హైకోర్టు
. దీంతో పిటిషన్ దాఖలు చేసిన సీపీఐ నేత రామకృష్ణ
. 24న విచారిస్తామన్న సీజేఐ ధర్మాసనం
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: రాజకీయ పార్టీల ర్యాలీలను నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో -1పై సోమవారం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. తొలుత ఈ జీవోను సవాల్ చేస్తూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వెకేషన్ బెంచ్ ఈ జీవోపై స్టే ఇవ్వగా, ప్రభుత్వం దానిపై అప్పీలుకు వెళ్లడంతో సీజే బెంచ్ ఆ స్టేను ఎత్తి వేసింది. కేసును స్వీకరించడం ద్వారా వెకేషన్ బెంచ్ పరిధిని మించి వ్యవహరించిందని సీజే ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రతి కేసు ముఖ్య మైందంటే హైకోర్టు ఏం అయిపోవాలి. ఇలాంటివి జరిగితే ప్రతి వెకేషన్ జడ్జి.. చీఫ్ జస్టిస్ అయినట్లే అని వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు అంత అత్యవసర మేమీ కాదని, కేసు మూలాల గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నామని హైకోర్టు చీఫ్ జస్టిస్ వ్యాఖ్యలు చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ వేసిన పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం విచారణను పూర్తి చేసి తీర్పును రిజర్వ్ చేసింది. మూడు నెలలు దాటుతున్నా తీర్పు వెలువడ డంలో తీవ్ర జాప్యం అవుతున్న నేపథ్యంలో పిటిషనర్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను ఈ నెల 24వ తేదీ విచారించేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్వీకరించింది.