. భీమవరంలో అర్ధనగ్న ప్రదర్శన
. కలెక్టరేట్ల వద్ద బాధితుల ధర్నాలు
విశాలాంధ్ర-భీమవరం/మచిలీపట్నం: అగ్రిగోల్డ్ బాధితులందరికీ ఆగస్టు 15వ తేదీలోగా డిపాజిట్లు చెల్లించి బాధితులకు ఆర్థిక స్వాతంత్య్రం కల్పించాలనీ, లేని పక్షంలో లక్షలాది అగ్రిగోల్డ్ బాధితులతో ఆగస్టు 30వ తేదీన అమరావతిని దిగ్బంధిస్తామని అగ్రిగోల్డ్ ఏజెంట్స్ అండ్ కస్టమర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.తిరుపతిరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిం చారు. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా అగ్రిగోల్డ్ బాధితులు సోమవారం రాష్ట్రంలోని అనేక కేంద్రాలలో కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. భీమవరంలో ర్టీసీ డిపో వద్ద నుంచి బాధితులు కలెక్టరేట్ వరకు అర్ధ నగ్న ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కలెక్టర్ పి.ప్రశాంతికి వినతి పత్రాన్ని అందచేశారు. ఈ సందర్భంగా తిరుమలరావు మాట్లా డుతూ గతంలో చంద్రబాబు అగ్రి బాధితులకు 250 కోట్లు ఇచ్చి చేతులు దులిపేసుకున్నాడని ఆ సంద ర్భంలో జరిగిన ఆమరణ నిరాహారదీక్షలు సందర్భంగా జగన్ శిబిరాన్ని సందర్శించి మన ప్రభుత్వం వచ్చిన వారంలోపు ఇరవై వేల రూపాయలు లోపు డిపాజిటర్లకు 1200 కోట్లు కేటాయించి న్యాయం చేస్తాననీ, ఆరు మాసాల్లో అందరికీ డిపాజిట్లు చెల్లించేస్తానని హామీ ఇవ్వడమే గాకుండా చంద్రబాబు ఇచ్చిన ఎక్స్గ్రేషియా ఐదు లక్షలు కాదు తాను పది లక్షలు ఇస్తానని హామీ ఇచ్చి ఎన్నికల్లో కూడా వాగ్ధానం చేసి ఓట్లు దండుకున్నాడని విమర్శించారు. ఎన్నికలు జరిగి నాలుగేళ్లు దాటినా ఇంత వరకు న్యాయం జరగలేదన్నారు. అధికారం చేపట్టిన తరువాత అగ్రిగోల్డ్ బాధితులకు కేవలం 236 కోట్లు కేటాయించి చేతులు దులిపేసుకున్నారు. గత ఎనిమిదిన్నర సంవత్సరాలుగా అగ్రిగోల్డ్ బాధితులు న్యాయం కోసం ఎదురు చూస్తున్నారనీ, పాలకులు పట్టించుకోకుండా గాలి కొదిలేయడం దారుణమని విమర్శించారు. అసోసి యేషన్ జిల్లా గౌరవాధ్యక్షులు కోనాల బీమారావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం దారుణమని బాధితులను మోసం చేసిన అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని శిక్షించకుండా కాలయాపన చేస్తున్నదని విమర్శించారు. కార్యక్రమంలో అసోసియేషన్ భీమవరం శాఖ గౌరవాధ్యక్షులు ఎం.సీతారాంప్రసాద్, పట్టణ కార్యదర్శి కె.గోపాలకృష్ణ, సీపీఐ పట్టణ కార్యదర్శి చెల్లబోయిన రంగారావు, గణపతి, రమణశ్రీను, ఎన్.పుల్లయ్య, ఐవీ సత్యనారాయణ, వెంకటేశ్వరరావు, రామారావు, సంతోష్, రజని, అన్నపూర్ణ, శ్రీదేవి, గంగలక్ష్మీÛ తదితరులు పాల్గొన్నారు.
అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలని అగ్రిగోల్డ్ కస్టమర్స్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కృష్ణా జిల్లా అధ్యక్షులు కే గగన్ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రం మచిలీపట్నంలోని ధర్నా చౌక్లో అగ్రి గోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకటికి మించి బాండ్లు కలిగిన వేలాది మంది పేదలు సొమ్ము ఖాతాల్లో పడక దిగులతో జీవిస్తున్నారని వారికి సత్వర న్యాయం చేయాలని కోరారు. సీపీిఐ నాయకులు మోదుమూడి రామారావు మాట్లాడుతూ 20వేల రూపాయలు పైబడి డిపాజిట్ చేసిన సుమారు ఏడు లక్షల మందికి బాధితులకు ఆరునెలల్లోపు పూర్తి న్యాయం చేస్తానని ఇచ్చిన హామీ పూర్తిస్థాయిలో అమలు చేయాలని కోరారు. సీపీఐ నియోజకవ వర్గ కార్యదర్శి లింగం ఫిలిప్ కూడా మాట్లాడారు. అనంతరం స్పందనలో అసోసియేషన్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో టి ఏడుకొండలు, కే వాసు, జల్లూరి కృష్ణమూర్తి, కమ్మ వరలక్ష్మి, గోగినేని దేవకీి మణి, షేక్ జైనవి తదితరులు పాల్గొన్నారు.