అవినీతిపై పూర్తిస్థాయి విచారణ: సీఎం రేవంత్రెడ్డి
విశాలాంధ్ర – హైదరాబాద్ : గత ప్రభుత్వంలా అబద్దాలతో కూడిన బడ్జెట్ కాకుండా తాము వాస్తవాల బడ్జెట్ను ప్రవేశపెట్టామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. మీడియాతో శనివారం అయన మాట్లాడుతూ, అబద్దాలు చెప్పి ఐదేళ్లు పాలించేదానికంటే నిజాలు చెప్పి ప్రజల ముందుకు వెళ్లడం మంచిదనే భావనతోనే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రస్తుతం నీటిపారుదల శాఖకు సంబంధించి రూ.16వేల కోట్లు వడ్డీ కట్టాల్సి వస్తుందని ఇది గత సర్కార్ పాపం కాదా అని నిలదీశారు. రుణమాఫీ వీలైనంత త్వరలోనే వుంటుందని,ే బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతామని స్పష్టం చేశారు. మహిళా సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి వుందన్నారు. నీటిపారుదలపై శ్వేతపత్రం ఇస్తామని, మేడిగడ్డపై జ్యుడిషియల్ విచారణ తర్వాత అన్ని నిజానిజాలు బయటకు వస్తాయన్నారు. ఈనెల 13న మేడిగడ్డ సందర్శనకు బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ కేసీఆర్ను తాము ఆహ్వానిస్తున్నామని, ఎవరు వస్తారనేది బీఆర్ఎస్ నిర్ణయిస్తుందన్నారు. ఈ` కార్స్ డీల్ పై అధికారిక విచారణ కొనసాగుతుందన్నారు. బీఏసీకి పార్టీ ఏపేరు ఇస్తుందో వారే రావాల్సి వుంటుందని అదే నిబంధన అని గతంలో తనను కూడా అలాగే బయటకు పంపారని గుర్తు చేశారు. ప్రతిపార్టీల ఎమ్మెల్యే అభివృద్ధి కోసం వస్తే కలుపుకుపోతామని, తనను కలిస్తేనే బీఆర్ఎస్ వారి ఎమ్మెల్యేలను అనుమానిస్తుందని పేర్కొన్నారు. రాజ్యసభలో రాష్ట్రానికి మూడు స్థానాలు వున్నాయని అయితే ఎంతమంది బరిలో వుంటారనే విషయం పార్టీ నిర్ణయిస్తుందన్నారు. సచివాలయ భవనం, అంబేడ్కర్ విగ్రహం, అమర జ్యోతి నిర్మాణాలపై విచారణ చేస్తామని, పది పైసలతో అయ్యేది పది రూపాయలు ఖర్చుపెడితే అద్భుతం అవుతుందా అంటూ నిలదీశారు. ఆరోగ్య కార్డ్ను ప్రత్యేకంగా ఉంచాలని భావిస్తున్నామని, అలాగే కొత్త రేషన్ కార్డు ఇవ్వడం నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందన్నారు. జాతీయ రహదారుల నిర్మాణంలో భూములు కోల్పోయిన వారికి రైతుబంధు ఇవ్వాలా అని నిలదీశారు.