రెండవ అఫిడవిట్ ఇస్తాం : కేంద్రం
అందుకు గడువు మంజూరు చేసిన న్యాయస్థానం
న్యూదిల్లీ : పెగాసస్ వ్యవహారంలో దాఖలైన ఫిర్యాదులపై స్వతంత్ర విచారణను వాయిదా వేయాలని కేంద్రప్రభుత్వం కోరగా అందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తదుపరి విచారణను ఈనెల 13వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో ప్రభుత్వం అఫిడవిట్ నమోదు చేసేందుకుగాను సంబంధిత అధికారులతో భేటీ అయ్యేందుకు కొంత సమయం కావాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరడంతో ఈ నిర్ణయం తీసుకుంది. గతంలోనే అఫిడవిట్ ఇచ్చారు కదా అంటూ ఆగస్టులో రెండు పేజీల అఫిడవిట్ను కేంద్రప్రభుత్వం సమర్పించడాన్ని సీజేఐ ప్రస్తావించారు. దీనికి స్పందించిన మెహతా.. అవసరమైతే మరొక అఫిడవిట్ దాఖలు చేసుకోవచ్చునని కేంద్రానికి కోర్టు అవకాశం ఇవ్వడాన్ని గుర్తుచేశారు. ఇజ్రాయిలీ స్పైవేర్పై విచారణను చీఫ్ జస్టిస్ రమణ, జస్టిస్ సూర్యకాంత, జస్టిస్ అనిరుద్ధా బోస్ల ధర్మాసనం చేపట్టగా కేంద్రం తరపు తుషార్ మెహతా వాదనలు వినిపించారు. కొన్ని అనివార్య కారాణాల వల్ల వేరొక అఫిడవిట్ దాఖలు చేసే విషయంలో సంబంధిత అధికారులతో కలిసేందుకు వీలు పడలేదని, అందుకు కొంత సమయం ఇవ్వాలని, కేసులను గురువారం లేదా సోమవారం లిస్టింగ్లో పెట్టాలని న్యాయస్థానాన్ని కోరారు. ఇంతకు ముందు మీరు అఫిడవిట్ ఇచ్చారని సీజేఐ అనగా మరొకటి దాఖలు చేయాలని కేంద్రం నిర్ణయించినట్లు మెహతా చెప్పారు. సీనియర్ జర్నలిస్టు ఎన్ రామ్ తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. కేంద్ర విజ్ఞప్తిపై తమకు అభ్యంతరం లేదన్నారు. దీంతో విచారణను సోమవారం చేపడతామని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. దేశ భద్రతా నేపథ్య అంశాలపై రాజీవద్దని, అన్ని విషయాలను బహిర్గతం చేయనక్కర్లేదని గతంలో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసిన సందర్భంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన విషయం విదితమే.