. మోదీ ప్రభుత్వ బ్లాక్మెయిల్ రాజకీయాలు సరికాదు
. విజయవాడ ధర్నాలో రామకృష్ణ
విశాలాంధ్ర – విజయవాడ: వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పరీక్ష పేపర్ లీక్ కావడంపై సీపీఐ ఆగ్రహం వ్యక్తంచేసింది. తక్షణమే నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేసింది. సీపీఐ విజయవాడ నగర సమితి అధ్వర్యంలో స్థానిక లెనిన్ సెంటర్లో శనివారం ధర్నా జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ నీట్ పరీక్ష పేపర్ లీక్పై దేశవ్యాప్తంగా విద్యార్థి, యువజన సంఘాలు, ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తున్నా…కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం స్పందించటం లేదన్నారు. నీట్ పరీక్ష రద్దు చేసి రాబోయే రోజుల్లో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో మరలా నీట్ పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇది 24 లక్షల మంది విద్యార్థుల సమస్య అన్నారు. కేంద్రం తక్షణం స్పందించి నీట్ పేపర్ లీకేజీపై సమగ్ర విచారణ జరిపించి…బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వం పదేళ్లుగా ప్రతిపక్షాలను బ్లాక్మెయిల్ చేయటమే పనిగా పెట్టుకుందని రామకృష్ణ ధ్వజమెత్తారు. ఈ పద్ధతిని మోదీ ప్రభుత్వం మానుకోవాలని హితవు పలికారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ వెనుక తేజస్వీయాదవ్ ఉన్నారంటూ ఎదురుదాడికి దిగుతోందని విమర్శించారు. ప్రతిపక్షాలు, పార్లమెంట్, చివరికి న్యాయస్థానాలపైనా మోదీకి గౌరవం లేదన్నారు. ఎవరూ కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదంటూ ప్రజాస్వామ్యానికి పాతర వేస్తున్నారని మండిపడ్డారు. దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను అక్రమంగా జైలులో పెట్టారని చెప్పారు. కేజ్రీవాల్ ఎవరి వద్దా డబ్బులు తీసుకోలేదని, ఆయన ఖాతాలో డబ్బులు పడలేదని, ఆయన వద్ద డబ్బులు లేవని తెలిసినా ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు.
విద్యార్థుల భవిష్యత్తో బీజేపీ వ్యాపారం: కోటేశ్వరరావు
సీపీఐ విజయవాడ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు మాట్లాడుతూ దేశంలో 706 వైద్య కళాశాలలు, 329 దంత వైద్య కళాశాలల్లో ప్రవేశం కోసం నిర్వహించిన నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ద్వారా బీజేపీ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో వ్యాపారం చేస్తున్నదనే విషయం బయటపడిందన్నారు. ప్రశ్నపత్రాన్ని రూ.30 లక్షలకు అమ్మేశారని చెప్పారు. దీంతో అర్హతలేని వారిని అందలం ఎక్కించే అవకాశం ఇచ్చారని విమర్శించారు. నీట్ పరీక్ష రద్దు చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని డిమాండ్ చేశారు. నీట్ నిర్వహణలో అవకతవకలు జరిగాయని పేర్కొన్నారు. పేపర్ లీకేజీ ఘటనపై సమగ్ర న్యాయవిచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జాన్సన్ బాబు, ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కి లెనిన్బాబు మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలు వెలువడే సమయంలో నీట్ పరీక్ష ఫలితాలు విడుదల చేయటం, 21 మందికి ఒకే పరీక్షా కేంద్రంలో 720 మార్కులు రావటం అనుమానాలకు తావిస్తున్నదన్నారు. దేశాల మధ్య యుద్ధాలు ఆపగలిగే మోదీ…మన దేశంలో పరీక్ష పేపర్ల లీకేజీలను ఆపలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కేవీవీ ప్రసాద్, కార్యవర్గ సభ్యులు పి.జమలయ్య, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పరుచూరి రాజేంద్రబాబు, సీపీఐ విజయవాడ నగర సహాయ కార్యదర్శి నక్కా వీరభద్రరావు పాల్గొన్నారు.
కక్షసాధింపు మంచిది కాదు: రామకృష్ణ
ప్రజాస్వామ్యంలో కక్ష సాధింపు చర్యలకు ఎవరు పాల్పడినా తప్పేనని రామకృష్ణ అన్నారు. నీట్ పరీక్ష రద్దుకు డిమాండ్ చేస్తూ సీపీఐ విజయవాడ నగర సమితి నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న ఆయన తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయం కూల్చివేయటంపై స్పందించారు. ప్రజావేదిక కూల్చివేతతో పరిపాలన ప్రాంభించిన జగన్మోహన్రెడ్డి విధానాన్ని ప్రతిఒక్కరూ తప్పుబట్టారని చెప్పారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంలో మాజీ సీఎం జగన్ను గౌరవించాలని చంద్రబాబు చెప్పడం శుభపరిణామమన్నారు. కక్ష సాధింపుతో ప్రభుత్వాలు వ్యవహరించటం ఏమాత్రం మంచిది కాదన్నారు. నియమనిబంధనలు పాటించాలన్నారు. తెల్లరుజామున వెళ్లి కూల్చేయాల్సిన పని లేదన్నారు. ముందుగా నచ్చజెప్పి… నోటీసులు ఇచ్చి తరువాత చర్యలు తీసుకోవాలన్నారు. ఎంతో అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంత ఇలాంటి పొరపాట్లు చేయకుండా వ్యవహరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.