అనంతపురం జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ ఉమాదేవి
విశాలాంధ్ర-రాప్తాడు : అనంతపురం జిల్లాలోని శాఖా గ్రంథాలయాల్లో మెరుగైన సదుపాయాలు కల్పించి వాటి అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తామని గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఎల్.ఎం.ఉమాదేవి అన్నారు. 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా బుధవారం రాప్తాడు శాఖా గ్రంథాలయంలో ఛైర్మన్ ఉమాదేవి, మాజీ ఛైర్మన్ ఎల్ఎం మోహన్ రెడ్డితో కలిసి లైబ్రేరియన్ వీరనారాయణరెడ్డి ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ, మాజీ ప్రధానమంత్రి దివంగత జవహర్ లాల్ నెహ్రూ, గ్రంథాలయ పితామహుడు అయ్యంకి వెంకటరమణయ్య చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థులు, పాఠకులతో చైర్మన్ ఉమాదేవి మాట్లాడుతూ పాఠకుల అభిరుచికనుగుణంగా రూ.40లక్షలు వెచ్చించి పుస్తకాలు కొనుగోలు చేసి ఆయా శాఖలకు చేరవేశామన్నారు. కరోనా ప్రభావంతో పాఠకులు గ్రంథాలయాలకు తగ్గారని, సాంకేతిక పరిజ్ఞానానికనుగుణంగా గ్రామాల్లో చైతన్య సదస్సులు పెట్టి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టి పాఠకులను పెంచుతామన్నారు. లైబ్రెరీలను డిజిటలైజ్ చేసేందుకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో చర్చించామన్నారు. వారోత్సవాలు సందర్బంగా గ్రంథాలయ ఉద్యమకారులను స్మరించుకోవడం సంతోషదాయకమన్నారు. విద్యార్థి దశ నుంచి పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకుంటే అపార జ్ఞానాన్ని సంపాదించవచ్చన్నారు. కార్యక్రమంలో సిబ్బంది సాకే ముత్యాలమ్మ, లక్ష్మినారాయణమ్మ పాల్గొన్నారు.