విశాలాంధ్ర`కళ్యాణదుర్గం టౌన్ : రాష్ట్రంలో అధికారం చేపట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాయలసీమకు తీరని ద్రోహం చేసిందని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున , నియోజకవర్గ కార్యదర్శి గోపాల్ ఆరోపించారు. గురువారం కళ్యాణదుర్గంలోని సిపిఐ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడుతూ జయహో బీసీ అంటూ విజయవాడలో చేపట్టిన వైసిపి కార్యక్రమం ఆ పార్టీ పరిపాలన విధానాన్ని , డొల్లతనాన్ని తేట తెల్లం చేసిందని గుర్తు చేశారు.. గడిచిన మూడున్నరేళ్లలో అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం రాయలసీమకు తీరని ద్రోహం చేసిందని గుర్తు చేశారు . కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు సాగునీరు అందించే హంద్రీనీవాను ముందుకు సాగనివ్వకుండా నిధులు మంజూరు చేయకుండా రైతుల నోట్లో మట్టి కొట్టారని దుయ్యబట్టారు. సెంట్రల్ యూనివర్సిటీని అనంతపురంలో స్థాపించినప్పటికి పైసా నిధులు తీసుకు రాకపోవడం విడ్డూరంగా ఉందన్నారు . కడపలో స్టీల్ ఫ్యాక్టరీ తెస్తామంటూ నమ్మబలికి అధికారంలోకి వచ్చాక విశాఖ ఉక్కును కేంద్ర ప్రభుత్వం ప్రవేట్ పరం చేస్తున్న కల్లుండి కబోదిలా జగన్ ప్రభుత్వం మిన్నకు ఉండి పోవడం నిజం కాదా అని ప్రశ్నించారు . ఎస్కేయూలో లా అడ్మిషన్లు పూర్తిగా నిలుపుదల చేస్తూ తీసుకున్న నిర్ణయం రాయలసీమ విద్యార్థులకు అన్యాయం చేసినట్లు అయిందన్నారు. కృష్ణ , గోదావరి నదులపై తెలంగాణ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తున్నా పట్టనట్లు వ్యవహరిస్తున్న జగన్ ప్రభుత్వం నిజంగా రాయలసీమ ప్రాంత వాసులకు ద్రోహం చేసినట్లు కాదా అని ప్రశ్నించారు . మూడు రాజధానుల%శీ%టూ ప్రగల్పాలు చెప్పే జగన్మోహన్ రెడ్డి ఒక్కచోట కూడా అభివృద్ధి చేయకపోవడం నిజం కాదా అని నిలదీశారు. కర్నూలులో హైకోర్టు పెట్టాలని ఆలోచన చేసిన జగన్ ప్రభుత్వం ఇందుకోసం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఇక్కడి ప్రజలను మోసగించినట్లు కాదా ఆని ఎద్దేవా చేశారు. విలేకరుల సమావేశంలో సిపిఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు .