ప్రజల సమస్యలపై పోరాడే వ్యక్తి…పార్టీలో అంచలంచెలుగా ఎదిగిన వ్యక్తి సీపీఐ అనంత అభ్యర్థి సి.జాఫర్
భాయ్ కైసే హై, అమ్మ ఎలాగున్నావ్ అంటూ ముందుకు సాగుతున్న ఎన్నికల ప్రచారం…
విశాలాంధ్ర -అనంతపురం (వైద్యం) : అనంతనగరంలో ఇండియా కూటమి అభ్యర్థి అయినటువంటి అనంత అర్బన్ అభ్యర్థి సి.జాఫర్ ఎన్నికల ప్రచారం ప్రజా అభిమానులతో ముందుకు సాగుతోంది. ఇండియా కూటమిలో భాగంగా సీపీఐ అనంత అర్బన్ అభ్యర్థిగా సి.జాఫర్ పేరును ప్రకటించడం జరిగింది. తనదైన శైలిలో ప్రచారాన్ని మొదలుపెట్టి ప్రజల్ని ఆకట్టుకుంటున్నారు. ఇండియా కూటమి ఆధ్వర్యంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాంభూపాల్, కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి శైలజనాథ్, అనంత పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వి. మల్లికార్జున ఆధ్వర్యంలో ఏప్రిల్ 23న సిపిఐ అనంత అభ్యర్థిగా సి.జాఫర్ నామినేషన్ దాఖలు చేశారు. తన ప్రచారంలో అనంత పట్టణానికి జరిగిన అవినీతిపై ప్రజలకు వివరంగా తెలియజేస్తూ అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటున్నారు. తను సీపీఐ లో గత 41 సంవత్సరాలుగా క్రింద స్థాయి నుంచి ప్రజల సమస్యలపై పోరాటం యోధుడు. అందులో భాగంగా పేద ప్రజలకు వేలకు పైగా పట్టాలిప్పించడం ఒక సీపీఐ పార్టీకే సాధ్యం. జాఫర్ పేద కుటుంబం నుంచి రావడంతో ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేస్తూ ప్రభుత్వాలతో పోరాడి సమస్యలను పరిష్కరించుకోవడం జరిగింది. సమస్యల కోసం నెలలు తరబడి ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు ఉద్యమాలు చేపట్టారు. ప్రస్తుత ఎన్నికల బరిలో వైకాపా, తెలుగుదేశం, జనసేన, బిజెపి అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో కోట్లాది రూపాయలు ధనాన్ని ఖర్చు పెడుతూ ప్రజలను మభ్య పెడుతున్నారు. ఆ పార్టీలకు ప్రజల సమస్య ముఖ్యం కాదని గెలుపే లక్ష్యంగా స్వార్థంతో పనిచేస్తున్నారు. ఏ స్వార్థం లేకుండా ప్రజల సమస్యలపై అవగాహన ఉన్న సీపీఐ అనంత అర్బన్ అభ్యర్థి సి. జాఫర్ కంకి కొడవలి గుర్తుకు ఓటు వేసి గెలిపించుకున్నప్పుడే అభివృద్ధి చెందుతుంది.