Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

కామ్రేడ్ చెట్ల రుద్రప్ప జీవితం నేటి తరానికి ఆదర్శం : ఆయన ఆశయాల కోసం పోరాడుదాం

కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో అందరి సహకారంతో రుద్రప్ప విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం

విశాలాంధ్ర:శెట్టూరు కామ్రేడ్ చెట్ల రుద్రప్ప జీవితం నేటి తరానికి ఆదర్శం అని సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్ సహాయ కార్యదర్శి మల్లికార్జున జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సంజీవప్ప, తాలూకా కార్యదర్శి గోపాల్ పేర్కొన్నారు.

శెట్టూరు మండల కేంద్రంలో కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకులు, శెట్టూరు గ్రామ మాజీ సర్పంచ్ చెట్ల రుద్రప్ప గారి సంస్మరణ సభ కుటుంబ సభ్యులు, కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించారు.
ఈ సమావేశంలో ముందుగా రుద్రప్ప చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సమావేశంలో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి సీపీఐ తొలితరం నాయకులుగా సుమారు ఐదు దశాబ్దాలపాటు సుదీర్ఘ కాలం ప్రజాజీవితంలో పనిచేశారు.
1952వ సంవత్సరంలో అనంతపురం జిల్లా కమ్యూనిస్ట్ యోధుడైన కామ్రేడ్ ఐదుకల్లు సదాశివన్ గారి నాయకత్వంలో కళ్యాణదుర్గం తాలూకా నాయకులైన బంగి ఎర్రిస్వామి, పియస్ శర్మ గారి నేతృత్వంలో కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. యువకుడిగా ఉన్నప్పటినుండి పార్టీ ఆదేశాల మేరకు ఈ ప్రాంతంలో జరిగిన అనేకమైన ప్రజా ఉద్యమాల్లో ప్రత్యక్షంగా, చురుగ్గా పాల్గొనడమే కాకుండా గ్రామాభివృద్ధి కోసం బాటలు వేసిన నిరాడంబర వ్యక్తి రుద్రప్ప. ఈ మండలంలోని పేద ప్రజల కోసం, సాగుభూమి కోసం కమతానహళ్లి, కైరేవు, అయ్యగార్లపల్లి, మాకొడికి తదితర గ్రామాల్లో దాదాపుగా మూడువేల ఎకరాల శోత్రియం భూములు, శివాయిజమా భూములు, బంజరు భూములను బడుగు బలహీన వర్గాలకు పంచే పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు.
రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ పిలుపు మేరకు ఆనాడు కృష్ణా జలాలను రాయలసీమకు మళ్లించాలి అనే నినాదంతో సత్యాగ్రహం చేసినందుకు కళ్యాణదుర్గం బంగి ఎర్రిస్వామి గారి నేతృత్వంలో ఒక నెల రోజులు పాటు సబ్ జైల్ జీవితం అనుభవించారు.1981వ శెట్టూరు గ్రామ సర్పంచ్ గా ఎన్నికైన తరువాత పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకుని గ్రామ అభివృద్ధి కోసం హాస్పిటల్,హైస్కూలు, సబ్ స్టేషన్, గ్రంథాలయం ఏర్పాటు చేయడంలో కీలకంగా వ్యవరించారు. కంబదూరు సమితి పరిధిలో నీతి నిజాయితీ, నిబద్ధత గల విలక్షణ నాయకుడిగా గుర్తింపు పొందారు. గ్రామంలో కరువు కాటకాలు సంభవించినప్పుడు గ్రామస్తులతో కలసి దొంగ రవాణాను అరికట్టి వారి నుండి ధాన్యం సేకరించి ప్రజలకు పంచిపెట్టడం జరిగింది. వెనకబడిన వర్గాలను చైతన్యపరిచి ఈ ప్రాంతంలో ప్రజాప్రతినిధులుగా ఎంపిక చేయడంలో ప్రధాన పాత్ర పోషించారు.
ఆయన ఆశయాలు కొనసాగించడమే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి అని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీటీ చైర్మన్ తిప్పేస్వామి, సిపిఎం జిల్లా నాయకులు ఓబులు, విశాలాంధ్ర రిటైర్డ్ మేనేజర్ ఈశ్వర్ రెడ్డి, వైయస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి బోయ తిప్పేస్వామి, డియన్ మూర్తి, మారుతీ చౌదరి, గ్రామ సర్పంచ్ కుమార్, జెడ్పిటిసి మంజునాథ్, నియోజకవర్గ రైతు సంఘం కార్యదర్శి నరసింహులు, నియోజకవర్గ సహాయ కార్యదర్శి మహాదేవ,గిరిజమ్మ, వై. గోపాల్, హరిదాసు, జయరాములు, అంజి, శివలింగప్ప, తిరుపాల్, నాగరాజు నాయక్, అబ్దుల్ వహాబ్, ఆర్జీ శివశంకర్, వైస్ ఎంపీపీ కిష్టప్ప, యంయస్ హనుమంత రాయుడు, దొడ్లో తిప్పేస్వామి,మాజీ సర్పంచ్ రమేష్ గురు ప్రసాద్, సోమనాథ్ రెడ్డి నగేష్, ఉప్పర శీనప్ప, తిమ్మరాయుడు, చనమల్లప్ప, వీరన్న, రామంజి, ప్రవీణ్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img