ఎంపీపీ సబ్బర హేమలత
విశాలాంధ్ర, అనంతపురం వైద్యం : ఇంటింటికి శుద్ధ జలం అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపడుతున్న జల్ జీవన్ మిషన్ పథకం ముఖ్య లక్ష్యమని ఎంపీపీ సబ్బర హేమలత అన్నారు. సోమవారం ఆత్మకూరు సచివాలయంలో జేజేఎం రైజెస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రజలకు, వాలంటీర్లకు అవగాహన కల్పించారు. ఎంపీపీ మాట్లాడుతూ పల్లెలోనూ ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని, ప్రతి వ్యక్తికీ రోజుకు సగటున 55 లీటర్ల నీటిని అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసిందన్నారు. జలజీవన్ మిషన్ పథకం ద్వారా 2024 నాటికి ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ ఇచ్చేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందన్నారు. గతంలో ఒక వ్యక్తికి రోజుకు సగటున 45 లీటర్ల ప్రామాణికత ఉండేదని, మారిన జీవన ప్రమాణాల నేపథ్యంలో సగటున ఓ వ్యక్తికి రోజుకు 55 లీటర్లు అవసరమన్నారు. గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య విభాగం (ఆర్డబ్ల్యూఎస్) అధికారులు ఈ పనులు చేపడుతున్నారన్నారు. జలజీవన్ మిషన్ పథకాల నిర్వహణలో ప్రజల భాగస్వామ్యం పెంచడానికి విలేజ్ వాటర్ శానిటేషన్ కమిటీని ఏర్పాటు చేస్తున్నారని… ఇందులో 25 శాతం మహిళలు, వార్డు మెంబర్లకు, 50 శాతం వెనకబడిన తరగతుల వారీకి సభ్యులుగా అవకాశం కల్పిస్తున్నారన్నారు. వీరికి అవసరమైన శిక్షణ ఇచ్చి తాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, వాటి సమగ్ర వినియోగంపై దృష్టిసారించేలా చూడనున్నారన్నారు. సీఎం జగన్ ఈ పథకంపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు. నీటిని వృథా చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో ఆత్మకూరు, సర్పంచు వరలక్ష్మివన్నూరప్ప, పంపనూరు సర్పంచు ఎర్రిస్వామి, పంచాయతీ కార్యదర్శి శైలజ, రైజెస్ ఎన్జీఓ ప్రతినిధులు శ్రీనివాసులు, ఓబులపతి తదితరులు పాల్గొన్నారు.