రాష్ట్రంపై కరోనా తీవ్రస్థాయిలో ప్రభావం చూపించిందని, దీంతో ప్రభుత్వ ఆదాయం తగ్గిపోయిందని ఆంధ్రప్రదేశ్ సీఎస్ సమీర్ శర్మ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీ జీవోలపై ఉద్యోగులు ఇప్పటికే ఆగ్రహంతో ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీవోలు నిలుపుదల చేయాలని డిమాండు చేస్తూ నిరసనలు చేపట్టారు. జీవోల వ్యవహారంపై సమ్మెకు సైతం సిద్ధమని ఉద్యోగ సంఘాలు ఇప్పటికే ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగుల పీఆర్సీ, ఇతర అంశాలపై సీఎస్ సమీర్ శర్మ బుధవారం మీడియాతో మాట్లాడుతూ, థర్డ్వేవ్ వల్ల మరింత నష్టం జరిగే పరిస్థితి కనిపిస్తోందని పేర్కొన్నారు. ఏపీలోనే ఉద్యోగుల జీతాల బడ్జెట్ ఎక్కువగా ఉందని తెలిపారు. ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు ప్రభుత్వం ఉద్యోగుల జీతాలు, సంక్షేమ పథకాలు బ్యాలెన్స్ చేసుకోవాలని తెలిపారు. కరోనా కష్టకాలంలో కూడా ఉద్యోగులకు ఐఆర్ ఇచ్చామని వివరించారు.
కరోనా లేకపోతే రాష్ట్ర రెవెన్యూ రూ.98 వేల కోట్లు ఉండేదని సమీర్ శర్మ చెప్పారు. పీఆర్సీ ఆలస్యం అవుతుందనే ఐఆర్ ఇచ్చామన్నారు. కరోనా కారణంగా రాష్ట్ర రెవెన్యూ రూ.62 వేల కోట్లే ఉందని తెలిపారు. కరోనా సంక్షోభంతో రాష్ట్ర ఆదాయం పడిపోయిందన్నారు. కొత్త పీఆర్సీతో ఎవరి జీతాలు తగ్గవని సీఎస్ పేర్కొన్నారు. జీతాలు తగ్గుతాయన్న ప్రచారం అవాస్తవమని అన్నారు. ఉద్యోగులందరినీ ప్రభుత్వం సమానంగానే చూస్తుందని తెలిపారు. ఐఏఎస్లకు ఎక్కువ జీతాలు వస్తున్నాయనడం అవాస్తవమని తెలిపారు.
ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ రావత్ మాట్లాడుతూ.. 27 శాతం ఐఆర్ గతంలో ఎవరూ ఇవ్వలేదేని తెలిపారు. అందరికీ న్యాయం చేయడానకి సీఎం వైఎస్ జగన్ ప్రయత్నించారని పేర్కొన్నారు. విభజన కారణంగా ఏపీ ఆర్థికంగా దిగజారిపోయిందని తెలిపారు. సేవా రంగం నుంచి వచ్చే పన్నుల ఆదాయం తగ్గిపోయిందని తెలిపారు.విభజనే వల్ల హైదరాబాద్ను కోల్పోయామని చెప్పారు. దాంతో పాటే పన్నుల ఆదాయం కూడా నష్టపోయామని పేర్కొన్నారు. ఏపీకి జనాభా ఎక్కువ.. పన్నుల ఆదాయం తక్కువ అని చెప్పారు. ఇంకా రూ. 33, 90 కోట్ల అప్పుల విభజన జరగాల్సి ఉందని పేర్కొన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల వాటా తగ్గిపోయిందని తెలిపారు. ఐఆర్ రూపంలో రూ. 17, 918 కోట్లు ఇచ్చామని వివరించారు. అంగన్వాడీ, అవుట్ సోర్సింగ్ సిబ్బందికి గౌరవ వేతనం పెంచామని చెప్పారు. ఆశా వర్కర్లకు కూడా గౌరవ వేతనాలు పెంచామని తెలిపారు. మధ్యాహ్న భోజన కార్మికులకు కూడా వేతనాలు పెంచామని చెప్పారు. కాంట్రాక్ట్ వర్కర్లకు మినిమం టైమ్ స్కేల్ అమలు చేస్తున్నామన్ి తెలిపారు.