విభజన గాయాల నుంచి ఆంధ్రప్రదేశ్ ఇంకా పూర్తిగా కోలుకోలేదని, కేంద్రం సహృదయంతో చేసే ప్రతి సాయం రాష్ట్ర పునర్ నిర్మాణానికి ఉపయోగపడుతుందని అని విశాఖలో ప్రధాని మోదీ పాల్గొన్న బహిరంగ సభ వేదికపై నుంచి సీఎం జగన్ ప్రసంగించారు. ప్రధానితోపాటు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జగన్ మాట్లాడుతూ, దేశ ప్రగతికి ప్రధాని మోదీ రథ సారథి విశాఖపట్నంలో జనసముద్రం కనిపిస్తుందన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం చేసే ప్రతి పనిని ఇక్కడ ప్రజలు గుర్తుంచుకుంటారన్నారు. కేంద్ర ప్రభుత్వంతో తమ బంధం పార్టీలు, రాజకీయాలకు అతీతం అని తెలిపారు. తమకు రాష్ట్ర ప్రయోజనాల తప్ప మరొక అజెండా ఉండదన్నారు. గడిచిన మూడున్నరేళ్లల్లో విద్య, వైద్య, వ్యవసాయం, సామాజిక న్యాయం, మహిళా సంక్షేమం, పారదర్శకత, గడప వద్దకే పరిపాలనే తమ ప్రాధాన్యతలుగా అడుగులు వేసినట్లు చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఆత్మ విశ్వాసంతో జీవించే పరిస్థితి కల్పించామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అండగా నిలిచి ముందుకు నడిపించాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. రూ.10,742 కోట్ల ప్రాజెక్టులు ప్రారంభిస్తున్న ప్రధాని మోడీకి రాష్ట్ర ప్రభుత్వం తరపున, ప్రజల తరపున ధన్యావాదాలు తెలిపారు. విభజన హామీల నుంచి ప్రత్యేక హౌదా, రైల్వే జోన్, పోలవరం, స్టీల్ ప్లాంట్ ఇలా పలు సందర్భాల్లో చేసిన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని పెద్దమనుసుతో వాటిని పరిష్కారించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టుగా చెప్పారు.