సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి
ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యుత్తమ నిర్వహణా పద్ధతులను అమలు చేయాలని, ఎవరి ఆరోగ్యం బాగోలేకపోయినా అందరూ కూడా ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లే పరిస్థితి ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాక్షించారు. వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే అవసరం ఇక ఉండకూడదని స్పష్టం చేశారు.తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైద్య, ఆరోగ్య శాఖపై మంగళవారం సమీక్ష చేపట్టారు. అదే విధంగా రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్, హెల్త్ హబ్స్, ఆస్పత్రుల నిర్వహణ, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్లపై కూడా సీఎం అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. హెల్త్హబ్స్ ద్వారా ఏర్పాటయ్యే ఆస్పత్రుల్లో కనీసం యాభై శాతం బెడ్లను ఆరోగ్యశ్రీ పేషెంట్లకు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. హెల్త్హబ్స్ ద్వారా వచ్చే ఆస్పత్రుల బోర్డుల్లో ఒక సభ్యుడు ప్రభుత్వం నుంచి ఉంటారని తెలిపారు. రాష్ట్రానికి చెందిన డాక్టర్లు ఇక్కడే స్థిరపడి మంచి వైద్య సేవలు అందించే ఉద్దేశం కూడా హెల్త్హబ్స్ ద్వారా నెరవేరుతుందన్నారు. అవయవ మార్పిడి చికిత్సలు చేసే ఆస్పత్రుల ఏర్పాటుపై హెల్త్ హబ్స్లో ప్రత్యేక దృష్టిపెట్టాలని పేర్కొన్నారు.. లాభాపేక్షలేకుండా ఆస్పత్రులు నిర్వహిస్తున్న సంస్థలకూ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు.సీహెచ్సీల నుంచి బోధనాసుపత్రుల వరకూ నిర్వహణ కోసం అధికారుల నియామకానికి సీఎం గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. ఉత్తమ నిర్వహణా పద్ధతులకు అనుగుణంగా కొత్తగా నిర్మిస్తున్న ఆస్పత్రులు, బోధనాసుపత్రుల నిర్మాణాలు ఉండాలని ఆదేశించారు. ఆస్పత్రుల్లో బెడ్ల నిర్వహణ, బాత్రూమ్ల నిర్వహణ, పరిశుభ్రత, ఆహారంలో నాణ్యత చాలా ముఖ్యమన్నారు.