నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరోసారి వినూత్నంగా నిరసన తెలియజేశారు. నెల్లూరు పరిధిలోని ఉమ్మారెడ్డిగుంటలో ఎమ్మెల్యే కోటంరెడ్డి నిరసన చేపట్టారు. మురుగు కాల్వలోకి దిగి ఆందోళనకు దిగారు.. కొన్నాళ్లుగా ఉమ్మారెడ్డిగుంటలో మురుగు కాల్వ సమస్య ఉందన్నారు. రైల్వే, కార్పొరేషన్ అధికారుల తీరు బాగోలేదని.. లిఖితపూర్వక హమీ ఇచ్చి పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యే సమస్య పరిష్కారం కాలేదంటూ.. మురుగు కాల్వలోకి దిగి నిరసనకు దిగడం స్థానికంగా చర్చనీయాంశమైంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో.. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా ఎమ్మెల్యే కోటంరెడ్డి మురుగు కాల్వలోకి దిగి నిరసన తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 31వ డివిజన్ చాణక్యపురి వద్ద ఉన్న వరద కాలువపై వంతెన నిర్మించే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద కాలువపై వంతెన నిర్మించి ప్రజల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గంట పాటు మురుగు కాల్వలోనే నిల్చోగా.. చివరకు అధికారులు వచ్చి హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. మరోసారి ఇప్పుడు కాల్వలోకి దిగారు.