సీఎం జగన్
ల్యాండు రికార్డుల అప్డేషన్, రిజిస్ట్రేషన్ తదితర ప్రక్రియలన్నీ అత్యంత పారదర్శకంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్షపై సీఎం జగన్ గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మనం తీసుకొస్తున్న సంస్కరణల కారణంగా ఎక్కడా అవినీతికి చోటులేని విధంగా, రైతులకు, భూ యజమానులకు మేలు చేసేలా ఉండాలన్నారు. నిర్దేశించుకున్న లక్ష్యంలోగా సర్వేను పూర్తి చేయాలని ఆదేశించారు. భూ క్రయ విక్రయాలు జరిగినప్పుడే రికార్డులు కూడా అప్డేట్ చేయాలన్నారు. గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్కు సంబంధించిన ప్రక్రియలు చేపట్టాలని, సర్వే డేటా భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా అధికారులు మండలానికి ఒక గ్రామం చొప్పున ఈ 650 గ్రామాల్లో సర్వే పూర్తి చేస్తామని చెప్పారు. జూన్ 22, 2022 నాటికి 2400 గ్రామాల్లో సర్వే పూర్తిచేస్తామని..జూన్, 2023 నాటికి మొత్తంగా రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో సర్వే పూర్తిచేస్తామని అధికారులు వెల్లడిరచారు. క్రయ విక్రయాల సమగ్ర డేటా అప్డేట్ కావాలని సీఎం ఆదేశించారు. భూముల క్రయ విక్రయాలు జరిగినప్పుడు పట్టాదారు పుస్తకానికి సంబంధించి అమ్మిన వ్యక్తి రికార్డుల్లోనూ, కొనుగోలు చేసిన వ్యక్తి రికార్డుల్లోనూ అప్డేట్ కావాలన్నారు. దీనిపై ప్రత్యేక టీంను పెట్టి.. తగిన విధానాన్ని రూపొందించాలన్నారు. ల్యాండ్ సర్వేను పూర్తిచేయడానికి తగినంత సాంకేతిక పరికరాలను సమకూర్చుకోవాలని ఆదేశించారు.
ఈ సమీక్షా సమావేశానికి ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూశాఖ) ధర్మాన కృష్ణదాస్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లాం, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, రెవెన్యూశాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, గృహనిర్మాణాశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ ఎస్ రావత్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి ఉషారాణి, రెవెన్యూశాఖ కమిషనర్ (సర్వే, సెటిల్మెంట్స్) సిద్దార్ధ జైన్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ కోన శశిధర్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ కమిషనర్ ఎం ఎం నాయక్, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా, ఏపీఎండీసీ వీసీ అండ్ ఎండీ వీ జీ వెంకటరెడ్డి ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.