అమిత్ షా, ఎన్టీఆర్ భేటీపై నాని ఆసక్తికర వ్యాఖ్యలు
జూనియర్ ఎన్టీఆర్`అమిత్షా భేటీపై మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. ప్రధాని మోదీ, అమిత్ షాలు ఉపయోగం లేకపోతే నిమిషం కూడా ఎవరితో మాట్లాడరంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఇద్దరి భేటీ వెనుక కచ్చితంగా రాజకీయ వ్యూహాలు ఉన్నాయని కొడాలి నాని అన్నారు. రాజకీయ వ్యూహంలో భాగంగా కేంద్రమంత్రి అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ను కలిసి ఉండొచ్చన్నారు. ఎన్టీఆర్ మద్దతుతో బీజేపీని బలపరచుకోవడానికి ఈ ప్రయత్నం జరిగి ఉండొచ్చని తాను భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. పాన్ ఇండియా స్టార్ అయిన జూనియర్ ఎన్టీఆర్తో బీజేపీ దేశవ్యాప్తంగా ప్రచారం చేయించే అవకాశం ఉందని..చంద్రబాబుతో ప్రయోజనం లేకే మోదీ అమిత్ షా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదన్నారు.ఎన్టీఆర్ను అభినందించడానికి, యాక్షన్ బావుందని చెప్పడానికి కలవరని.. తారక్ ఇప్పటికే 25 సినిమాలు చేశారని.. అమిత్ షా కూడా చాలా సినిమాలు చూసుంటారన్నారు. ఇప్పుడు కొత్తగా అభినందించడం ఏముంటుందన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్లో ఆదివారం సమావేశమైన సంగతి తెలిసిందే. తెలంగాణ పర్యటనకు వచ్చిన అమిత్ షా.. తారక్ను డిన్నర్ మీట్కు ఆహ్వానించారు. హైదరాబాద్ నోవాటెల్ హోటల్ వేదికగా అమిత్ షాను ఎన్టీఆర్ కలిశారు. ఇద్దరు దాదాపు అరగంటపాటు భేటీ కొనసాగగా. తర్వాత డిన్నర్ చేశారు.ఈ సమావేశం తర్వాత అమిత్షా ట్వీట్ చేశారు. ‘అత్యంత ప్రతిభావంతుడైన నటుడు, తెలుగు సినిమా తారక రత్నం అయిన జూనియర్ ఎన్టీఆర్తో ఈ రోజు హైదరాబాద్లో కలిసి మాట్లాడటం చాలా ఆనందంగా అనిపించింది..’ అన్నారు. ఈ ట్వీట్పై తారక్ స్పందించారు. ‘మిమ్మల్ని కలవడం.. మీతో కలిసి మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. మీ మంచి మాటలకు ధన్యవాదాలు..’ అని తెలిపారు. ఈ భేటీపై టాలీవుడ్తో పాటూ రాజకీయాల్లోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది.