విశాలాంధ్ర`గుంటూరు: స్కీమ్ వర్కర్లు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీ ఓబులేసు ఆందోళన వ్యక్తం చేశారు. స్కీమ్ వర్కర్లను ఆదుకుంటామని చెప్పిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ పథకాలను స్కీమ్ వర్కర్ల ద్వారా అమలు జరిపించుకుంటూ సమస్యల పరిష్కారంలో మాత్రం వారికి మొండిచేయి చూపిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం సోమవారం గుంటూరు మల్లయ్యలింగం భవన్లో జరిగింది. అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె.ప్రేమ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్యఅతిథిóగా హాజరైన ఓబులేసు మాట్లాడారు. ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఐసీడీఎస్కు నిధులు తగ్గించారని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో పౌష్టికాహార లోపంతో పిల్లలు, బాలింతలు చనిపోతున్నారని, వారు అనేకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఒక వైపు ప్రభుత్వమే చెబుతూ మరోవైపు ప్రాజెక్టుకు ఇవ్వాల్సిన నిధులలో కోతలు విధించడం దుర్మార్గమన్నారు. కేంద్రం బాధ్యత తీసుకుని గత సంవత్సరానికి ఏమాత్రం తగ్గకుండా పెరుగుతున్న జనాభా అవసరాల రీత్యా ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాలలో ఐసీడీఎస్కు నిధులు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. స్కీమ్ వర్కర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చే సందర్భంలో గ్రాడ్యువిటీ ఇవ్వాలని సుప్రీం కోర్టు చారిత్రాత్మకమైన తీర్చు ఇచ్చిందని అన్నారు. కేంద్రం తీరు సరిగ్గా లేదనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా మరింత అధ్వాన్నంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అంగన్వాడీలకు 12 ఏళ్లుగా వేతనాలు పెంచకుండా వారికి తీవ్ర అన్యాయం చేస్తోందన్నారు. ప్రభుత్వ పథకాలను అమలు చేసే అంగన్వాడీలపై చిన్నచూపు చూస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ హాజరు విధానాన్ని తీసుకువచ్చిందని, నెట్వర్క్ సరిగ్గా లేని పరిస్థితులలో ముఖ హాజరు ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఇటువంటి యాప్లను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కనీస వేతనం రూ.26 వేలు చేస్తూ రానున్న బడ్జెట్ సమా వేశాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పెట్టాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే కార్మిక సంఘాలతో చర్చించాల్సిన అవసరం ఉందని, అలా కాకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే కుదరదని స్పష్టం చేశారు.
అంగన్వాడీలపై హీనంగా మాట్లాడిన ఫుడ్ ఇన్స్పెక్టర్ను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అన్ని కార్మిక సంఘాలను కలుపుకుని పోరాటం చేస్తామని హెచ్చరిం చారు. ఏఐటీ యూసీ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు వెలుగూరి రాధాకృష్ణమూర్తి, అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె.లలిత, నాయకులు సుగుణమ్మ, హెల్దాఫ్లోరెన్స్, సరోజినీ, మల్లేశ్వరి, మరియంబి, ఏఐటీయూసీ గుంటూరు జిల్లా కన్వీనర్ మేడా హనుమంతరావు, నగర అధ్యక్షులు రావుల అంజిబాబు తదితరులు పాల్గొన్నారు.