టీడీపీ తీరుపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అస్తమించిన వ్యవస్థ.. కొంతమంది బ్రోకర్లు విశాఖపై విషం కక్కుతున్నారని మండిపడ్డారు. ఒక అబద్ధాన్ని చంద్రబాబు , పవన్ కళ్యాణ్ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. గుడివాడ 33వ వార్డులో గడపగడప మన ప్రభుత్వం రెండవ రోజు కార్యక్రమంలో కొడాలి నాని పాల్గొన్నారు. అనంతరం టీడీపీపై విమర్శలు చేశారు. లోకేష్కు పార్టీ అప్పగించేందుకు అమరావతి రైతుల పాదయాత్రలో జూనియర్ ఎన్టీఆర్ను తిట్టిస్తున్నారన్నారు. అమరావతి ప్రాంతంలో టీడీపీ వాళ్ళు చేసిన రియల్ ఎస్టేట్ మాఫియా.. విశాఖలో కూడా జరుగుతునట్లు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. 29 గ్రామాల అమరావతి ఎక్కడ, 25 లక్షల జనాభా గల విశాఖ ఎక్కడని వ్యాఖ్యానించారు. టీడీపీ రియల్ ఎస్టేట్ బ్రోకర్లు విశాఖ నగరంపై విషం కక్కుతున్నారని ధ్వజమెత్తారు.. ప్రభుత్వ ఆస్తి అయిన రుషికొండలో ప్రభుత్వ కార్యాలయాలు కడుతుంటే దోపిడీ ఎలా అవుతుందని ప్రశ్నించారు. రూ.30 లక్షలు ఉన్న అమరావతి భూములు రూ.10 కోట్లకు పెరిగాయన్నారు. రాజధాని నిర్ణయం తర్వాత గజాలు లెక్కన విక్రయాలు జరిగే విశాఖ భూముల ధరల్లో ఏం మార్పు వచ్చిందని ప్రశ్నించారు. విశాఖ దసపల్లా భూముల్లో టీడీపీ ఆఫీసు, చంద్రబాబు అనుయాయుల కార్యాలయాలు ఉన్నాయని విమర్శించారు. ఆ స్థలాన్ని వైఎస్సార్సీపీ ఎంపీ ఎలా కబ్జా చేస్తారని ప్రశ్నించారు. టీడీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని.. నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.