రోజుకు ఐదు నియోజకవర్గాల సమీక్ష
నియోజకవర్గాల వారీగా పార్టీని బలోపేతం చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టి సారించారు. నేటి నుంచి నియోజకవర్గాల టీడీపీ ఇన్చార్జిలతో సమావేశం కానున్నారు. అవనిగడ్డ, మార్కాపురం, సంతనూతలపాడు, పెనమలూరు, గుంటూరు (ఈస్ట్) పార్టీ ఇన్చార్జిలతో ఒక్కొక్కరితో విడిగా మాట్లాడనున్నారు. నియోజకవర్గ పరిస్థితులు, పార్టీ బలాబలాలు, రాజకీయ పరిణామాలపై వారితో చర్చించనున్నారు. రోజుకు ఐదు నియోజకవర్గాలను సమీక్షించాలని టీడీపీ అధినేత భావిస్తున్నారు. ఆ మేరకు నియోజకవర్గాల టీడీపీ ఇన్చార్జిలకు సమాచారం అందించారు. నియోజకవర్గంలో పార్టీలోనే ఎవరైనా వ్యతిరేకులు ఉన్నారా, వచ్చే అసెంబ్లీ ఎన్నికల ఆశావహులు ఎవరు? వంటి అంశాలను ఈ వన్ టు వన్ సమావేశాల్లో చర్చించనున్నారు.వారితో ఆత్మీయంగా మాట్లాడి నియోజకవర్గాలకు సంబంధించిన లోటుపాట్లను తెలుసుకోవడమే ఈ వన్ టు వన్ సమావేశాల ఉద్దేశంగా తెలుస్తోంది.