విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : పోలవరం ప్రాజెక్టులోని గ్యాప్1, 2ల్లో గతంలో గోదావరి వరదల వల్ల ఏర్పడిన అగాథాలను పూడ్చే ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ (డీడీఆర్పీ) ఆమోదించిన డిజైన్ ప్రకారం ఈ పనులు ప్రారంభమయ్యాయి. జలవనరుల శాఖ ఎస్ఈ నరసింహామూర్తి, ఈఈలు మల్లికార్జున రావు, పాండురంగయ్య, మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) సీజీఎంఎం ముద్దు కృష్ణ, జనరల్ మేనేజర్ గంగాధర్, అసోసియేట్ జనరల్ మేనేజర్ మురళి పమ్మి కలిసి గ్యాప్ 1,2లలో పూజలు నిర్వహించి పనులు ప్రారంభించారు. రెండు ప్రాంతాల్లో ఏర్పడిన అగాథాలను పూడ్చటంలో భాగంగా ఇసుకను అక్కడ డోజర్ల ద్వారా నింపుతున్నారు. ఇసుకను నింపిన తరువాత వైబ్రో క్యాంపక్షన్ విధానం ద్వారా ఆ ప్రాంతాన్ని గట్టిపరుస్తారు. ఇది పూర్తైన తరువాత నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ (ఎన్హెచ్పీసీ) డయాఫ్రామ్ వాల్ పటిష్టతపై ఇచ్చిన నివేదిక ఆధారంగా డీడీఆర్పీ ఆమోదం పొందాక సంబంధిత పనులు చేపడతారు. డయాఫ్రామ్ వాల్ పనులు పూర్తైన తరువాత ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ (ఈసీఆర్ఎఫ్) పనులు ప్రారంభమవుతాయి.