మంత్రి పేర్ని నాని
ఐదో రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సినిమా చట్ట సవరణ బిల్లుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. సినిమా షోలను ఇష్టానుసారంగా వేస్తున్నారని, చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా వేస్తున్నారని అన్నారు.కొందరు ఇష్టానుసారం ధరలను పెంచుకుంటున్నారని, అందుకే ఆన్లైన్ విధానంలో టికెట్ ఇచ్చే పద్ధతి తేవాలనుకున్నామని తెలిపారు. దాంతో పాటు సినిమా షోలను కూడా అదుపు చెయ్యాలని నిర్ణయించామని చెప్పారు. సినిమా పరిశ్రమ ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా నడవాలని తెలిపారు.సినిమా కలెక్షన్లు, కడుతున్న టాక్సులకు సంబంధం లేదని చెప్పారు.ప్రభుత్వ పోర్టల్ ద్వారా పారదర్శకంగా, ప్రజలకు మంచి అందుబాటులో ఉండే ధరకి టికెట్లను తీసుకొస్తామని తెలిపారు.సినిమాటోగ్రఫీ చట్టంలో మార్పులు చేశామని తెలిపారు. థియేటర్లతో పాటు ఆన్లైన్లో కూడా టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని చెప్పారు.
పర్యావరణ హితం కోసమే కేంద్రం ఆదేశాల మేరకు గ్రీన్ టాక్స్ పెంచుతున్నామని, పాత వాహనాలను నిరుత్సాహ పరిచి పర్యావరణానికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఆటో, టూ వీలర్స్కి ఈ పెంపుదల ఉండదని, రూ. 20 లక్షలు పైబడిన వాహనాలకు మాత్రమే ఇది వర్తిస్తుందని తెలిపారు.