వాస్తవ పరిస్థితులు..ఊహలకు భిన్నంగా కనిపించేసరికి సీఎం జగన్ భాష మారిందని టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ అన్నారు.ప్రశాంత్ కిశోర్ ఇచ్చిన నివేదికలో ప్రభుత్వం విఫలమైందని తెలిసిందని దీంతో, అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు స్వరంలో తీవ్రతను పెంచుతున్నారని అన్నారు. బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్న ఏ వ్యక్తి అయినా పీకుడు భాష మాట్లాడతారా? అని ప్రశ్నించారు. హైదరాబాద్లోని తెదేపా కార్యలయంలో పయ్యావుల మీడియాతో మాట్లాడారు. జగన్ కు ప్రజలు అధికారాన్ని కట్టబెట్టి మూడేళ్లయిందని ఈ మూడేళ్లలో ఆయన ఏం పీకారో చెప్పాలని పయ్యావుల డిమాండ్ చేశారు. ఈ మూడేళ్లలో వైస్సార్సీపీ ప్రభుత్వం ఒక్క పనైనా సక్రమంగా చేసిందా? అని తాను ప్రశ్నిస్తున్నానన్నారు. ‘ప్రజల జీవితాల్లో వెలుగులు పీకడమే మీరు చేసింది. ఆ భాష మేం మాట్లాడే భాష కాదు. సీఎం మాట్లాడిన తీరుతోనే ఆ భాష మాట్లాడాల్సి వచ్చింది. భాష మార్చుకోకపోతే ప్రజలే మిమ్మల్ని పీకే పరిస్థితి వస్తుంది.’ అని అన్నారు. ప్రశాంత్ కిశోర్ ను పీకే దమ్ముందా? అని జగన్ ను పయ్యావుల ప్రశ్నించారు. రాయలసీమలో ఎంత మంది మంత్రులను జగన్ పీకుతారో చూస్తానని అన్నారు. విపక్షాలు, మీడియాపై పీకుడు భాషతో దాడి చేస్తారా? అని మండిపడ్డారు. బలహీనతను కప్పిపుచ్చుకోవడానికే జగన్ ఇలాంటి భాష వాడుతున్నారని పయ్యావుల అన్నారు. సీఎం అసమర్థతకు ఈ వ్యాఖ్యలే నిదర్శనమని చెప్పారు. తాను బలంగా ఉన్నానని చెప్పుకోవడానికే జగన్ ఈ వ్యాఖ్యలు చేశారని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలపై టీడీపీ పోరాటం చేస్తుందని ఆయన తెలిపారు.