టీడీపీ నేత యనమల రామకృష్ణుడు
ఏపీ ఆర్థిక నిర్వహణ బాగుందంటూ వైసీపీ నేతలు నిజాలను కప్పిపెడుతున్నారని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. వృద్ధి రేటు 10.22ను మైనస్ 2.58 శాతానికి రివర్స్ చేశారని అన్నారు. సంక్షేమంలో ఏపీ ముందుందనడం తుపాకీ రాముడి కోతలేనని ఎద్దేవా చేశారు. సంక్షేమం బాగుంటే డీబీటీలో 19వ స్థానంలో ఎందుకుందని ఆయన ప్రశ్నించారు. డీబీటీ కింద సంక్షేమ పథకాలు ఎన్ని రద్దు చేశారో బుగ్గన చెప్పాలని నిలదీశారు. ఏపీలో పేదరికం ఎందుకు పెరిగిపోయిందని, ఆర్థిక అసమానతలు 34 నుంచి 43 శాతానికి ఎందుకు పెరిగాయని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం రూ.371756 కోట్ల అప్పు చేసిందని ఆయన అన్నారు. ఎఫ్ఆర్బీఎం పరిమితులను ఉల్లంఘించారని చెప్పారు. ప్రభుత్వ భవిష్యత్ కార్యాచరణపై గ్రీన్ పేపర్ విడుదల చేయాలని అన్నారు.